తప్పుడు ప్రచారం చేసినంత మాత్రాన మీరేమీ ఉత్తములు అయిపోరు: షర్మిల పవర్ పంచ్
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ రాజారెడ్డిపై చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి నాయకులు దుష్ప్రచారం చేస్తోన్నారంటూ వైఎస్ షర్మిల ఆరోపించారు. ఈ లోకంలో లేని, సంజాయిషీ ఇచ్చుకోలేని వారిపై టీడీపీ చేస్తున్న దుష్ప్రచారం వారి రాజకీయ అక్కసును బయట పెట్టిందని విమర్శించారు.
నిజంగా వారు అంత దుర్మార్గులే అయితే ఆనాడే తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు విచారణ జరపలేదని వైఎస్ షర్మిల నిలదీశారు. వారిని ఎందుకు శిక్షించడం చేతకాలేదా? అని ప్రశ్నంచారు. ఇప్పుడు కూడా కూటమి అధికారంలోకొచ్చి రెండేళ్లు అవుతుందని, చెప్పుకోదగ్గ విజయాలు లేకనే కదా ఈ గోలంతా అని ఎద్దేవా చేశారు. సొంతగా ఎదిగే సత్తా లేక, పాలన వైఫల్యాన్ని కప్పిపుచ్చేందుకు దివంగతులను లాగి టీడీపీ చేస్తున్నవి నీచ రాజకీయాలని మండిపడ్డారు.

పగబట్టి తప్పుడు ప్రచారం చేసినంత మాత్రాన మీరు ఉత్తములు అయిపోరని, ఆకాశం మీద ఉమ్మేస్తే అది తిరిగి ఎక్కడ పడుతుందో రెండేళ్లుగా అధ్వాన్న పాలన చేసే ఆపర మేధావులు తెలుసుకోవాలని చురకలు అంటించారు. వైఎస్ రాజారెడ్డి సీమలో జరిగిన అరాచకాలు ఎదురించి పేదల పక్షాన నిలబడ్డ వ్యక్తి అని గుర్తు చేశారు. కడప ప్రజలకోసం 1973 లోనే 70 పడకల ఆసుపత్రిని నిర్మించి ఉచిత వైద్యం అందించారని పేర్కొన్నారు.
పేద బిడ్డల ఉన్నత చదువుల కోసం డిగ్రీ కాలేజీ, పాలిటెక్నిక్ కళాశాలను కట్టించి ఉచిత విద్యను అందించిన ఘనత ఆనాడు కడప జిల్లాలో ఆయనకే దక్కిందని చెప్పారు. ఎంతో మంది పేదల జీవితాలను నిలబెట్టిన మహా మనిషిగా అభివర్ణించారు. ఇలాంటి వ్యక్తి చరిత్రను వక్రీకరించి, తప్పుగా చిత్రీకరిస్తే రాయలసీమ ప్రజలు హర్షించరని అన్నారు.
సంక్షేమం, అభివృద్ధి అనే పదాలకు చిరునామా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. పార్టీలకు అతీతంగా, మన, పర అనే తేడా లేకుండా, పరిపాలన చేసిన మహనీయుడు వైఎస్ఆర్ అని షర్మిల పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్, రుణమాఫీ, ఉచిత కరెంటు లాంటి పథకాలు ఒక్క వైఎస్ఆర్ కే సాధ్యం అయ్యాయని, పోలవరాన్ని మొదలు పెట్టి 33 శాతం పనులు అయిదేళ్లలో పూర్తి చేస్తే, తర్వాత రెండు సార్లు సీఎంగా ఉన్న చంద్రబాబు గారికి మిగతా పనుల పూర్తికి చేతకాలేదని ధ్వజమెత్తారు.
రుణమాఫీ, మాట ఇచ్చిన నిరుద్యోగ భృతి ఇవ్వడానికి, రూ. 1,500 ప్రతినెలా మహిళలకు ఇవ్వడానికి టీడీపీ కూటమి ప్రభుత్వానికి చేతకావట్లేదని ధ్వజమెత్తారు. బురద జల్లాలని చూసినంత మాత్రాన సూర్యుడి కాంతి తగ్గదన్నట్లు వైఎస్ఆర్ ను ఎవరూ చిన్న చేయలేరని, తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఇంట పూజ గదిలో ఆయనకు స్థానం దక్కిందని షర్మిల చెప్పారు. ఎన్ని కుయుక్తులు పన్నినా ప్రజల గుండెల్లో ఆయన స్థానాన్ని చెరపలేరని పేర్కొన్నారు. కడప జిల్లాలో ఫ్యాక్షన్ లేదనడానికి కారణం వైఎస్ఆర్ అనేది జగమెరిగిన సత్యమని, అవగాహన రాహిత్యంతో దివంగత నేత వైఎస్ఆర్ ను నిందించాలని చూడటం చంద్రబాబు, ఆయన టీంకు తగదని హితవు పలికారు.












Click it and Unblock the Notifications