చంద్రబాబు చుట్టూ ఉచ్చును మరింత గట్టిగా బిగించిన సీఐడీ: మాజీ మంత్రి భార్య పేరు
అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అరెస్టయిన తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో విచారణను ఎదుర్కొంటోన్నారు. ఈ కేసులో విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం రిమాండ్ విధించింది. జ్యుడీషియల్ కస్టడీకి తరలించింది.
అదే సమయంలో ప్రభుత్వం అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్లో కుంభకోణాన్ని సైతం తెర మీదికి తీసుకొచ్చింది. ఈ వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటోన్నారు. ఈ విషయంలో ఆయనకు ఏపీ సీఐడీ అధికారులు 41ఏ కింద నోటీసులను సైతం జారీ చేశారు. ఢిల్లీ వెళ్లి మరీ నారా లోకేష్కు నోటీసులను అందజేశారు.

ఇదే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పొంగూరు నారాయణకూ నోటీసులు అందాయి. సీఐడీ అధికారులు ఆయనకూ నోటీసులను ఇచ్చారు. మున్సిపల్ శాఖ మంత్రి హోదాలో ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పులు, మాస్టర్ప్లాన్కు ఆమోదించారని భావిస్తున్నారు.
రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ వ్యవహారంలో చంద్రబాబుపై ఉచ్చును మరింత గట్టిగా బిగించారు సీఐడీ అధికారులు. ఈ కేసులో తాజాగా మరో పిటీషన్ను దాఖలు చేశారు. దీనికి సంబంధించిన పిటీషన్ను విజయవాడ ఏసీబీ కోర్టులో దాఖలు చేశారు. ఈ కేసులో మరో నలుగురిని నిందితులుగా చేర్చారు.
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మున్సిపల్ శాఖ మాజీ మంత్రి పొంగూరు నారాయణ భార్య రమాదేవి పేరును చేర్చారు. రమాదేవి బంధువు రాపూరి సాంబశివరావు, నారాయణ కాలేజీ ఉద్యోగి ధనుంజయ్ భార్య ప్రమీల, నారాయణ బంధువు ఆవుల మణిశంకర్ పేర్లను చేరుస్తూ సీఐడీ అధికారులు పిటీషన్ వేశారు.
దీనికి కారణాలు లేకపోలేదు. నారాయణ భార్య రమాదేవికి చెందిన బ్యాంక్ అకౌంట్ల నుంచి కొన్ని కోట్ల రూపాయలు ప్రమీల, మణిశంకర్, సాంబశివ రావు ఖాతాలకు బదిలీ అయినట్లు గుర్తించారు. అలా ఆ మొత్తం వారి అకౌంట్లకు చేరిన రెండు రోజుల వ్యవధిలో పొలం రిజిస్ట్రేషన్ అయినట్లు గుర్తించారు.
ఇందులో కొన్ని అసైన్డ్ భూములు ఉన్నట్లు సీఐడీ అధికారుల దర్యాప్తులో తేలింది. సీడ్ కేపిటల్, స్టార్టప్ ఏరియాకు అనుకుని ఉన్నాయని తెలుస్తోంది. ఆ ఏరియా నుంచే ఇన్నర్ రింగ్ రోడ్ మొదలవుతుందనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి. తెల్లరంగు రేషన్ కార్డును సైతం కలిగి ఉన్నారని చెబుతున్నారు.
ప్రభుత్వం వారికి చెందిన 58 ఎకరాల భూమికి సంబంధించిన ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చిన కౌలు మొత్తాన్ని ఆయా అదే బ్యాంక్ అకౌంట్లకు వెళ్లాయని, అక్కడి నుంచి నేరుగా నారాయణ విద్యాసంస్థల ఖాతాలకు బదిలీ అయ్యాయని సమాచారం. దీని ఆధారంగానే తాజాగా సీఐడీ అధికారులు ఈ కేసు పెట్టారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications