ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం.. కొత్త జోనల్ వ్యవస్థ..95 శాతం ఉద్యోగాలు స్థానికులకే..
ఏపీ ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో స్థానికులకు మెరుగైన అవకాశాలు కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం తాజాగా కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రం జారీ చేసిన 2025 రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వం జీవో 45 ద్వారా కొత్త జోనల్ వ్యవస్థను అమల్లోకి తెచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తాజా ఉత్తర్వుల ప్రకారం.. ప్రభుత్వ ఉద్యోగాల్లో 95 శాతం పోస్టులను స్థానికులకే కేటాయించనున్నారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ తర్వాత ఏర్పడిన 26 జిల్లాల ప్రకారం ఉద్యోగాల కేటాయింపును సవరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఇక కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారం.. రాష్ట్రాన్ని మొత్తం 6 జోన్లు, 2 మల్టీ జోన్లుగా విభజించారు. ఉద్యోగాల స్వభావం, వేతన స్థాయి ఆధారంగా పోస్టులను జిల్లా, జోన్ అదేవిధంగా మల్టీ జోన్ స్థాయిలుగా వర్గీకరించారు. దీని ద్వారా నియామక ప్రక్రియ మరింత పారదర్శకంగా, వ్యవస్థీకృతంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. స్థానిక అభ్యర్థులకు 95 శాతం వరకు రిజర్వేషన్ అమలు చేయనున్నారు.
అలాగే స్థానికతను నిర్ణయించేందుకు 4 సంవత్సరాల చదువు లేదా నివాసాన్ని ప్రమాణంగా తీసుకుంటారు. చదువు లేని వారికి 4 సంవత్సరాల నివాసాన్ని ఆధారంగా పరిగణిస్తారు. అవసరమైతే 7 సంవత్సరాల నివాసాన్ని కూడా స్థానికతకు ప్రమాణంగా గుర్తించే అవకాశం ఇవ్వనున్నారు. ఇక ఉపాధ్యాయ నియామకాల విషయంలో జిల్లా యూనిట్ విధానాన్ని అమలు చేయనున్నారు. అంతేకాక ఉద్యోగుల కేటాయింపులో సీనియారిటీ ప్రకారం ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఈ మార్పులపై ఎవరైనా అభ్యంతరాలు వ్యక్తం చేయాలనుకుంటే 60 రోజుల గడువును విధించారు.
వీటిలో కొన్ని కీలక విభాగాలకు మినహాయింపులు ఇచ్చారు. ఏపీ సచివాలయం, హెచ్ఓడీ కార్యాలయాలు, రాష్ట్ర స్థాయి సంస్థలకు ఈ స్థానిక కేడర్ నిబంధనలు వర్తించవని ఉత్తర్వుల్లో అధికారులు పేర్కొన్నారు. ఇక ఈ విభాగాల్లో రాష్ట్రవ్యాప్తంగా మెరిట్ ఆధారంగా నియామకాలు కొనసాగనున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఈ నిర్ణయం కీలకంగా మారనుంది.

జోన్- 1 లో భాగంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలు ఉన్నాయి.
జోన్- 2 లో భాగంగా అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలు ఉన్నాయి.
జోన్- 3 లో భాగంగా పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలు ఉన్నాయి.
జోన్- 4 లో భాగంగా గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు ఉన్నాయి.
జోన్- 5 లో భాగంగా తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాలు ఉన్నాయి.
జోన్- 6 లో భాగంగా నంద్యాల, అనంతపురం, కర్నూలు, శ్రీ సత్యసాయి జిల్లాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications