విశాఖలో ఐటిఐఆర్కి రెడీ, కార్పోరేట్ కళ:రంగంలో లీడర్స్
హైదరాబాద్: విశాఖలో ఐటి ఇండస్ట్రియల్ రీజియన్ (ఐటిఐఆర్) ఏర్పాటుకు తొమ్మిది వేల ఎకరాలను గుర్తించారు. నక్కపల్లికి సమీపంలో ఈ తొమ్మిది వేల ఎకరాలను గుర్తించినట్టు ఏపీఐఐసి అధికారులు తెలిపారు. ఐటికి చెందిన భారీ పరిశ్రమలతో పాటు, వాటి అనుబంధ పరిశ్రమలు కూడా ఇక్కడ స్థాపించడానికి అనువైన భూమిని గుర్తించామని తెలిపారు.
దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపామని చెప్పారు. ఇందులో ఏ మాత్రం వ్యవసాయ భూమి లేదన్నారు. ఐటిఐఆర్కు కేంద్ర ప్రభుత్వం 50 శాతం నిధులను కేటాయిస్తుందని, ఈ మొత్తాన్ని ముందుగా రాబట్టుకోవాలంటే భూమిని చూపించాల్సిన అవసరం ఉంది. అందుకోసం నక్కపల్లి మండలంలోని తొమ్మిది వేల ఎకరాలను సిద్ధం చేశారని సమాచారం.
ఇదిలా ఉండగా కొత్తగా వచ్చిన భూసేకరణ చట్టం ప్రకారం భూమి కోల్పోయిన వారికి భారీ ప్యాకేజీ అందుతుంది. దీంతో రైతుల నుంచి పెద్ద ఎత్తున భూమిని రాజకీయ నాయకులు, కొందరు పెద్దలు ముందుగానే కొనుగోలు చేశారట. విశాఖ జిల్లా ఆనందపురం, పద్మనాభం, శ్రీకాకుళం జిల్లా రణస్థలం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లా చుట్టుపక్క భూములు రాజకీయ నాయకుల చేతుల్లోకి వెళ్లిపోయాయని అంటున్నారు.
ఉత్తరాంధ్రకు ప్రభుత్వం బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ కల్పించింది. దీంతో చాలామంది పారిశ్రామికవేత్తలు విశాఖకు వచ్చి స్థలాల కోసం అన్వేషిస్తున్నారు. విశాఖకు వారు క్యూ కడుతున్నారు. కాగా, ప్రైవేటు సంస్థలు పరిశ్రమలు, లేదా కర్మాగారాలను స్థాపించాలనుకుంటే, వారే సదరు రైతులు, లేదా భూయజమానులతో నేరుగా బేరసారాలు చేసుకుంటే బాగుంటుందన్న అభిప్రాయంలో ప్రభుత్వం ఉండవచ్చునని అంటున్నారు.
కాగా, విశాఖకు పారిశ్రామికవేత్తలు క్యూ కడుతున్నారు. 80 సంస్థలు ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్నాయని సమాచారం. కొత్తగా 480 సంస్థలు హైదరాబాదు నుండి తరలిపోయే అవకాశముందని అంటున్నారు. ఇరు రాష్ట్రాల్లోను చాలామంది తమ పరిశ్రమలను ఉంచనున్నారు. పారిశ్రామికవేత్తల క్యూ నేపథ్యంలో విశాఖకు కార్పోరేట్ కళ వచ్చింది.