నేను విన్నాను.. నేను ఉన్నానంటూ మాయమాటలు - ప్రభుత్వాన్ని కూల్చచ్చు : ఏపీఎన్జీఓ నేత సంచలనం..!!
ఏపీ ప్రభుత్వం పైన ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసులు సంచలన వ్యాఖ్యలు చేసారు. వైసీపీ ప్రభుత్వ తీరుపై బండి శ్రీనివాసులు చేసిన ఈ ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు ప్రభుత్వ వర్గాల్లో ఒక్కసారిగా చర్చ కు కారణమయ్యాయి. పీఆర్సీతో పాటుగా ఇతర డిమాండ్ల కోసం కొంత కాలగా ఏపీ ఎన్డీఓ సంఘంతో పాటుగా మరి కొన్ని ఇతర సంఘాలు జేఏసీగా ఏర్పడి ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచుతున్నాయి. ఇందుకోసం ఇప్పటికే మూడు సార్లు జాయింగ్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలోనూ పాల్గొన్నారు.
మాయ మాటలతో 151 సీట్లు
ఉద్యోగ సంఘాల నేతలు తమకు ముందుగా పీఆర్సీ నివేదిక ఇవ్వాలని కోరుతున్నారు. అయితే, తాజాగా ముఖ్యమంత్రి జగన్ తిరుపతి లో వారం - పది రోజుల్లో పీఆర్సీ ప్రకటిస్తామని ప్రకటించారు. ఈ సమయంలో జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ప్రభుత్వం నుంచి పీఆర్సీ నివేదిక అందకపోవటంతో... తమను అవమానించా రంటూ ఉద్యోగ సంఘాల నేతలు వ్యాఖ్యానించారు. ఇక, ఇప్పుడు ఏపీఎన్జీఓ అధ్యక్షుడు ప్రభుత్వం పైన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఒక్కో ఉద్యోగికి అయిదు ఓట్లు ఉన్నాయి
నేను విన్నాను.. నేను ఉన్నాను అని ఎప్పిన మాయ మాటలు విని 151 సీట్లు తీసుకొని వచ్చామని వ్యాఖ్యానించారు. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అని చెబుతూ... అలాంటిదే ఈ పిచ్చి పిచ్చి మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్లంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఉద్యోగుల పరిస్థితేంటో చంద్రబాబుకు బాగా తెలుసంటూ చెప్పుకొచ్చారు. ఏపీ వ్యాప్తంగా 13 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారని చెప్పారు. ఒక్కొక్క ఉద్యోగికి ఐదు ఓట్లు ఉంటాయని. ..ఈ లెక్కన ఒక్కొక్కరి వద్ద అయిదు ఓట్ల లెక్కన 60 లక్షల మంది ప్రభుత్వాన్ని కూల్చొచ్చు అంటూ సీరియస్ వ్యాఖ్యలు చేసారు.
Recommended Video
ప్రభుత్వాన్ని కూల్చే శక్తి ఉంది
ఉద్యోగుల శక్తి ముందు ఎవరైనా తలవంచాల్సిందే బండి శ్రీనివాసులు చెప్పుకొచ్చారు. తాను అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఉద్యోగుల పరిస్థితి గురించి పలు మార్లు చెప్పానన్నారు. ఉద్యోగులు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతీ ఒక్కరికీ చులకన అవుతున్నారని వ్యాఖ్యానించారు. ప్రతీ ఉద్యోగి ఒకటో తేదీన జీతం తీసుకోవటం రాజ్యంగ హక్కు అని చెప్పుకొచ్చారు. రేపటి నుంచి ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్ల సాధన కోసం నిరసన కార్యక్రమాలకు నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసు ఇచ్చింది. ఇక, తాజాగా ఏపీఎన్జీఓ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యల పైన ప్రభుత్వం నుంచి ఎటువంటి రియాక్షన్ వస్తుందనేది చూడాలి.