పెత్తనంవద్దు సెక్షన్8 చాలు, ప్రశాంతమని గవర్నర్ చెప్పడం బాధాకరం: అశోక్
విశాఖ: తమకు హైదరాబాదులో పెత్తనం చెలాయించాలనే ఉద్దేశ్యం ఏ కోశాన లేదని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు బుధవారం విశాఖలో అన్నారు. సెక్షన్ 8 చెల్లుతుందని, హైదరాబాద్ పదేళ్లు ఉమ్మడి రాజధాని అని దీని పైన గవర్నర్ నరసింహన్ స్పందించాలని ఆయన కోరారు.
తెలంగాణలో పలుచోట్ల ఆంధ్రా ఉద్యోగులను ఏకపక్షంగా రిలీవ్ చేశారన్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత పదేళ్ల వరకు ఉండవచ్చునని కేంద్రం చెప్పిందని తెలిపాడు. రాజధాని నిర్మించాలంటే కనీసం ఐదేళ్ల సమయం పడుతుందని చెప్పాడు.
విద్యాశాఖలో బ్యాంక్ ఖాతాలు సీజ్ చేశారని ఆరోపించారు. పునర్విభజన చట్టంలోని అన్ని సెక్షన్లు చెల్లినప్పుడు సెక్షన్ 8 ఎందుకు చెల్లదో చెప్పాలన్నారు. సెక్షన్ 8 పైన గవర్నర్ నరసింహన్ స్పందించాల్సిన అవసరం ఉందని చెప్పారు.
హైదరాబాదులో ఉద్యోగులకు ప్రత్యేక రక్షణ ఉండాలని డిమాండ్ చేశారు. హైదరాబాదులో చాలా ప్రశాంతంగా ఉందని గవర్నర్ చెప్పడం చాలా దురదృష్టకరమన్నారు. ఉద్యోగులను ఏకపక్షంగా రిలీవే చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా, సెక్షన్ 8 అమలు చేస్తే తెలంగాణలో మరో ఉద్యమం పుట్టుకు వస్తుందని తెలంగాణ ఉద్యోగ సంఘాలు మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం ఏపీఎన్జీవో సంఘాలు సెక్షన్ 8 కోసం డిమాండ్ చేస్తున్నాయి.