ప్రొటెం స్పీకర్గా అప్పలనాయుడు..? స్పీకర్ పదవికే కోడెల కళంకం తెచ్చాడంటున్న వైసీపి నేతలు..!!
అమరావతి/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రొటెం స్పీకర్గా వైసీపీకి చెందిన ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన్న అప్పలనాయుడు నియమించే అవకాశం ఉంది. విజయనగరం జిల్లా బొబ్బిలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇప్పటికి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా అప్పలనాయుడు ఎన్నికయ్యారు. తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మాజీ మంత్రి సుజయ్కృష్ణ రంగారావుపై అప్పలనాయుడు విజయం సాధించిన విషయం తెలిసిందే.
ఈ నెల 12వ తేదీ నుంచి ఏపీ శాసనసభ సమావేశాలు ప్రారంభం కానుండడంతో.. ప్రొటెం స్పీకర్గా శంబంగి వెంకట చిన్న అప్పలనాయుడు నియమితులైతే శాసనసభ సమావేశాల తొలి రోజున కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ఈయన ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. స్పీకర్ ఎన్నికను నిర్వహించి.. కొత్తగా ఎన్నికైన స్పీకర్కు పదవీ బాధ్యతలు అప్పగించే వరకు ప్రొటెం స్పీకర్గా ఆ పదవిలో కొనసాగుతారు.
ఇదిలా ఉండగా పార్లమెంటరీ పార్టీ నేతగా నియమించిన పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆ పార్టీ ఎంపీ విజయ సాయి రెడ్డి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. పార్టీ లోక్సభ పక్ష నేతగా నియమితులైన పి.మిథున్ రెడ్డి, చీఫ్ విప్గా నియమితులైన మార్గని భరత్ రామ్కు ఆయన ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉండగా స్పీకర్ పదవికి టీడీపీ నేత, మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్రావు కళంకం తెచ్చారని ధ్వజమెత్తారు.
కోడెల ప్రజాధనం దుర్వినియోగంపై ట్విట్టర్లో విజయ సాయిరెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రజాధనం దోపిడీలో జులుం ప్రదర్శించి కోడెల స్పీకర్ పదవికే కళంకం తెచ్చారన్నారు. ఆరోగ్యశ్రీ, ఉద్యోగుల హెల్త్ స్కీం, ఫార్మసీ కౌన్సిల్ ఆఫీసులను కనీస వసతులు కూడా లేని తన సొంత భవనంలో పెట్టించి వేల కోట్లను దోచుకున్నారని వైసీపి నేతలు ఘాటుగా విమర్శించారు.