‘నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు’: సీఎం వైఎస్ జగన్పై పవన్ కళ్యాణ్, చంద్రబాబు నిప్పులు
హైదరాబాద్/అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ను తొలగించడంపై అటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఇటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏపీ సర్కారుపై తీవ్రంగా మండిపడ్డారు. ఎస్ఈసీని తొలగించేందుకు సమయం ఇప్పుడే దొరికిందా? అని నిలదీశారు.

జగన్ రెడ్డిలో ఎలాంటి మార్పూ లేదు..
‘కక్ష సాధింపు, మొండి వైఖరి, ఏకపక్ష నిర్ణయాలతో జగన్ రెడ్డి ప్రభుత్వం మరోసారి వ్యవహరించింది. ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ను తొలగిస్తూ జారీ చేసిన ఉత్తర్వు ద్వారా తమ వైఖరిలో ఎటువంటి మార్పు లేదని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తెలిపారు' అని పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు.

"నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు" అన్నట్లుగా..
‘ముఖ్యమైన విషయాలలో జగన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు అప్రజాస్వామికంగానే ఉంటున్నాయి.. వీటన్నిటిలోను హైకోర్టుతో చీవాట్లు పెట్టించుకున్నా "నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు" అన్న సామెతలా సాగుతోంది ప్రభుత్వం వ్యవహారం. ఎలక్షన్ కమిషనరును తొలగించడానికి ఇదా సమయం..?' అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.

ఇలాంటి సమయంలో కక్ష తీర్చుకుంటారా?
‘ఒక వైపు కరోనాతో ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. ప్రభుత్వం తన శక్తిసామర్ధ్యాలను ప్రజలను కాపాడడంపై కేంద్రీకరించాలి. ఇందుకు భిన్నంగా ప్రభుత్వంలోని పెద్దలు ఇలా కక్ష తీర్చుకునే కార్యక్రమంలో మునిగిపోయారు.? కరోనా పడగ విప్పుతున్న సమయాన ఎన్నికలు నిర్వహించి ఉంటే ప్రజల ప్రాణాలు ఎంతటి ప్రమాదంలో పడివుండేవో ఊహించగలమా..?' అని పవన్ కళ్యాణ్ వైసీపీ సర్కారుపై మండిపడ్డారు.

జనసేన కోరుకున్నది అదొక్కటే.. కానీ..
‘దేశం ఆపత్కాలంలో ఉన్నందున ఈ సమయంలో రాజకీయాలు చేయరాదని జనసేన స్వీయ నియంత్రణ పాటిస్తోంది. మీరు తీసుకుంటున్న ఇటువంటి కక్ష సాధింపు నిర్ణయాల కారణంగా.. ఈ నియంత్రణను దాటి మీ చర్యను ఖండించవలసిన పరిస్థితిని మీరే సృష్టించారు. జనసేన కోరుకుంటున్నది ఒక్కటే.. ఇది ప్రజల ప్రాణాలను కాపాడే సమయం. మీ కార్యాచరణ ఆ దిశగా ఉండాలి' అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
Recommended Video

జగన్ సర్కారు తీరుపై చంద్రబాబు నిప్పులు.. గవర్నర్కు లేఖ
ఇది ఇలావుండగా, ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపుపై చంద్రబాబు కూడా తీవ్రంగా మండిపడ్డారు. ఏపీలో స్థానిక ఎన్నికల ప్రక్రియ మధ్యలో ఆగివుండగా దొడ్డిదారిన ఎస్ఈసీ రమేష్ కుమార్ ను తొలగించాల్సిన అవసరం ఏంటని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా ఎస్ఈసీని తొలగించడం సరికాదని ఆయన అన్నారు. ఈ మేరకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కు ఈ మెయిల్ ద్వారా లేఖ పంపారు. రాజ్యాంగంలోని నిబంధన 243(కే) ప్రకారం 2016లో ఐదేళ్ల కాలపరిమితికి రమేష్ కుమార్ ఎస్ఈసీగా నియమితులైనట్లు చంద్రబాబు తెలిపారు. ప్రస్తుతం కరోనా వ్యాప్తి నేపథ్యంలో స్థానిక ఎన్నికల వాయిదా పడిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఇలాంటి సమయంలో ఎస్ఈసీని మార్చడం అనైతికమని, చట్ట విరుద్ధమని అన్నారు. ఎస్ఈసీని పదవీకాలం ముగిసేవరకూ కొనసాగించాలని, తాజా ఆర్డినెన్స్ను తాత్కాలికంగా నిలిపివేయాలని గవర్నర్కు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications