నిమ్మగడ్డకు ప్రాణభయం: ఆయనపై తక్షణ చర్యలు: డీజీపీ సవాంగ్కు లేఖ
అమరావతి: పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ను వ్యతరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య కాకర్ల వెంకట్రామిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదమైంది. ఈ వ్యవహారం మరింత ముదిరింది. డీజీపీ కార్యాలయానికి చేరింది. ఇప్పటికే ఈ వ్యాఖ్యల ప్రభావం పెను రాజకీయ దుమారానికి దారి తీసింది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలే ఆయన వెనుక ఉన్నారంటూ రాజకీయ ప్రత్యర్థులు మండిపడుతున్నారు.. తాజాగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దీనిపై స్పందించారు.
ఏకంగా డీజీపీ గౌతమ్ సవాంగ్కు లేఖ రాశారు. రాజ్యాంగబద్ధంగా తాను విడుదల చేసిన ఎన్నికల నోటిఫికేషన్ను వ్యతిరేకిస్తూ వెంకట్రామిరెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. తన ప్రాణాలకు ముప్పు కలిగినప్పుడు ఎదుటివారిని చంపే హక్కు రాజ్యాంగం తనకు కల్పించిందంటూ వెంకట్రామిరెడ్డి పరోక్షంగా తనను హెచ్చరించారని తెలిపారు. తనను ఉద్దేశించి వెంకట్రామిరెడ్డి చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమని నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేర్కొన్నారు.
వెంకట్రామిరెడ్డి తనపై భౌతిక దాడులకు దిగే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఆయన కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టాలని డీజీపీకి విజ్ఙప్తి చేశారు. తనకు ప్రాణహాని కలిగిస్తానంటూ వెంకట్రామిరెడ్డి పరోక్షంగా హెచ్చరించారని ఆరోపించారు. ఆయనపై తక్షణ చర్యలను తీసుకోవాలని కోరారు. ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం వెనుక రాజకీయ దురుద్దేశం ఉన్నాయనే అనుమానాలను నిమ్మగడ్డ వ్యక్తం చేశారు.
వెంకట్రామిరెడ్డిపై తక్షణ చర్యలను తీసుకోవడానికి గల అవకాశాలను పరిశిలించాలని సూచించారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, తనకు ప్రాణాపాయాన్ని కల్పించే ఎదుటి వ్యక్తి ప్రాణాలు తీసే హక్కును కూడా తనకు రాజ్యాంగం కల్పించిందంటూ వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యానించారు. ఎన్నికల విధులు నిర్వర్తించే ఉద్యోగులకు వ్యాక్సిన్ ఇవ్వాలని, వ్యాక్సిన్ ఇచ్చేంత వరకు తాము ఎన్నికల విధులకు హాజరు కాబోమని తేల్చి చెప్పారు.