ఏపీలో కానిస్టేబుల్ నియామకాల రాత పరీక్షా ఫలితాలు వెల్లడి: రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి..!!
ఏపీలో పోలీస్ కానిస్టేబుల్ నియామకాల రాత పరీక్షా ఫలితాలు వెల్లడయ్యాయి. కొద్దిసేపటి కిందటే రాష్ట్రస్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అధికారులు వీటిని విడుదల చేశారు. తమ అధికారిక వెబ్ సైట్ లో వాటిని పొందుపరిచారు.
అమరావతి: రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ నియామకాలకు సంబంధించిన ప్రిలిమినరీ రాత పరీక్షా ఫలితాలు వెల్లడయ్యాయి. ఏపీ రాష్ట్రస్థాయి పోలీస్ కానిస్టేబుళ్ల రిక్రూట్ మెంట్ బోర్డ్ అధికారులు ఈ ఫలితాలను విడుదల చేశారు. వాటిని తమ అధికారిక వెబ్ సైట్ slprb.ap.gov.inలో అందుబాటులో ఉంచారు. రిజిస్ట్రేషన్ నంబర్, ప్రిలిమినరీ టెస్ట్ హాల్ టికెట్ నంబర్ ను పొందుపర్చడం ద్వారా అభ్యర్థులు తమ ఫలితాలను తెలుసుకోవచ్చు.
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి కీలక సూచన చేసిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ..!!
కిందటి నెల 22వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా 35 ప్రాంతాల్లో 997 కేంద్రాల్లో ఏపీ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డ్.. ఈ ప్రిలిమినరీ పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే. మొత్తంగా 4,59,182 మంది అభ్యర్థులు ఈ పరీక్షలను రాశారు. వారిలో 95,208 మంది అభ్యర్థులు ఈ ప్రిలిమినరీ పరీక్షల్లో ఉత్తీర్ణులు అయ్యారు.
200 మార్కుల కోసం నిర్వహించిన ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలంటే ఓసీ అభ్యర్థులు-40 శాతం, బీసీ అభ్యర్థులు- 35 శాతం, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్ మెన్- 30 శాతం మేర మార్కులను సాధించాల్సి ఉంటుంది. రాతపరీక్షను నిర్వహించిన రోజే పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డ్.. ప్రిలిమినరీ ఆన్సర్ కీ షీట్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా 2,261 అభ్యంతరాలు బోర్డుకు అందాయి.
వాటన్నింటినీ పరీశీలించిన తరువాత మూడు ప్రశ్నలకు సంబంధించిన సమాధానాలను అధికారులు మార్పులు చేశారు. ఫైనల్ ఆన్సర్ కీ షీట్ ను రెఫరెన్స్ కోసం వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు. స్కానింగ్ చేసిన ఓఎంఆర్ షీట్స్ కూడా ఇదే వెబ్ సైట్ లో లభ్యమౌతాయి. వాటిని అభ్యర్థులు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ నెల 7వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఈ ఓఎంఆర్ షీట్స్ వెబ్ సైట్ లో ఉంటాయి. అభ్యర్థులు ఈ లోగా వాటిని డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తరువాత వాటిని తొలగిస్తారు.
ఇక దేహధారుడ్య పరీక్షలు ఈ నెల 13వ తేదీ నుంచి చేపట్టనున్నారు. ప్రిలిమినరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు మలిదశలో ఈ ఫిజికల్ అండ్ మెడికల్ టెస్టులు ఉంటాయి. దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 13వ తేదీ నుంచి 20వ తేదీ 5 గంటలకు వరకు గడువు ఉంటుంది. ఫిజికల్ ఫిట్ నెస్ పరీక్షల కోసం అభ్యర్థులు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రంలో మొత్తం 6,100 పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు ఈ ప్రిలిమ్స్ ను నిర్వహించారు అధికారులు.