శబరిమలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు, ప్రముఖ ఆలయాలతో సహా - ప్యాకేజీలు ఇలా..!!
శబరిమల భక్తులకు ఆర్టీసీ కీలక అప్డేట్ ఇచ్చింది. శబరిమలకు వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేసింది. ప్రముఖ ఆలయాల సందర్శిస్తూ శబరిమలకు వెళ్లే విధంగా రూట్ ఖరారు చేసింది. ఇందు కోసం రోజుల లెక్కన ప్యాకేజీలను ప్రకటించింది. భక్తుల డిమాండ్ మేరకు సర్వీసులను పెంచటంతో పాటుగా రూట్ల విషయంలోనూ మార్పులు ఉంటాయని అధికారులు వెల్లడించారు. ఈ ప్రత్యేక బస్సులకు రిజర్వేషన్లు ప్రారంభించారు.
కార్తీక మాసం ప్రారంభమైంది. పంచారామాలు... ప్రముఖ శైవక్షేత్రాలతో పాటుగా శబరిమలకు వెళ్లే భక్తుల సంఖ్య పెరుగుతోంది. దీంతో, వీరి డిమాండ్ మేరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. అదనపు సర్వీసులతో పాటుగా ఆర్టీసీ బస్సులు అద్దె ప్రాతిపదికన అందించేందుకు సిద్దం అయింది. ఇందు కోసం 5, 6,7 రోజుల యాత్రల ప్యాకేజీలను వెల్లడించింది. 5 రోజుల యాత్రలో విశాఖపట్నం నుంచి విజయవాడ, మేల్మరువత్తూర్, ఎరుమేలి, పంబా (శివం) వరకు వెళ్తుంది. తిరుగు ప్రయాణంలో శ్రీపురం, కాణిపాకం, తిరుపతి, విజయవాడ మీదుగా విశాఖపట్నం చేరుకుంటుంది. 5 రోజుల యాత్రలో టికెట్ ధరలు పెద్దలకు సూపర్ లగ్జరీ, అల్ట్రాడీలక్స్ బస్సులకు రూ.6,600, ఇంద్ర సర్వీసుకు రూ.8,500గా నిర్ణయించారు.

6 రోజుల యాత్రలో టికెట్ ధరలు పెద్దలకు సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్ బస్సులకు రూ.7 వేలు, ఇంద్ర సర్వీసుకు రూ.9 వేలుగా నిర్ణయించారు. ఇక, 7 రోజుల యాత్ర లో విశాఖ నుంచి బయల్దేరి విజయవాడ, కాణిపాకం, శ్రీపురం, భవాని, పళని, ఎరుమేళి, పంబా చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో తమిళనాడులోని మదురై, రామేశ్వరంతో పాటు తిరుపతి, శ్రీకాళహస్తి, విజయవాడ, ద్వారపూడి, అన్నవరం మీదుగా విశాఖ చేరుతుంది. సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్ బస్సులకు రూ.7,600, ఇంద్ర సర్వీసుకు రూ.10 వేలుగా నిర్ణయించారు. కాగా, కార్తిక మాసం పురస్కరించుకుని పంచారామాలకు ప్రత్యేక బస్సులు నడిపించనున్నట్లు డీఎం తెలిపారు. ఈ నెల 25న ఇంద్ర ఏసీ బస్సును ప్రారంభిస్తున్నామని, టికెట్ ధర పెద్దలకు రూ.2,800గా నిర్ణయించారు.












Click it and Unblock the Notifications