ఏపీలో రోడ్డెక్కనున్న 1638 బస్సులు: ఛార్జీలపై క్లారిటీ: పిల్లలు, వృద్ధులకు నో ఎంట్రీ
అమరావతి: రాష్ట్రంలో ఎట్టకేలకు ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కబోతున్నాయి. గురువారం ఉదయం 7 గంటలకు బస్సు సర్వీసులు ఆరంభం కానున్నాయి. సాయంత్రం 7 గంటల్లోగా అన్ని బస్సులు సంబంధిత డిపోలకు చేరుకుంటాయి. అంటే- 12 గంటల పాటు మాత్రమే బస్సు సర్వీసులు అందుబాటులో ఉంటాయి. తొలిదశలో 1638 బస్సులను అందుబాటులోకి తీసుకుని రానున్నట్లు ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ మాదిరెడ్డి ప్రతాప్ తెలిపారు. చిన్నపిల్లలు, 60 సంవత్సరాలు దాటిన వృద్ధలకు బస్సును ఎక్కనివ్వబోమని స్పష్టం చేశారు.
ఏపీలో బస్సెక్కాలంటే కొత్త రూల్స్ ఇవే- పాటిస్తేనే ప్రయాణం- తేడా వస్తే మధ్యలోనే దించేస్తారు..
సీటింగ్లో మార్పులు..
కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి ప్రవేశపెట్టిన లాక్డౌన్ వల్ల సుమారు 56 రోజుల పాటు ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. గురువారం నుంచి పాక్షికంగా రోడ్డెక్కబోతున్నాయి. ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు మాదిరెడ్డి ప్రతాప్ చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి ప్రయాణికుల మధ్య భౌతికదూరాన్ని తప్పని చేశామని అన్నారు. దీనికోసం బస్సు సీటింగ్లో మార్పులు చేసినట్లు చెప్పారు.
నో క్యాష్..
ప్రయాణికులు బస్సు ఎక్కడానికి ముందే టికెట్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీనికోసం బస్స్టేషన్లలో ప్రత్యేకంగా కౌంటర్లను ఏర్పాటు చేస్తారు. బస్సులో కండక్టర్ ఉండడు. టికెట్లను జారీ చేయడానికి టిమ్స్ను వినియోగిస్తారు. డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా టికెట్లను కొనుగోలు చేయడానికి ప్రాధాన్యత ఇచ్చారు. నగదు ద్వారా టికెట్లను కొనుగోలు చేయడాన్ని ప్రోత్సహించకూడదనే ఉద్దేశంతోనే ఈ వ్యవస్థను ప్రవేశపెట్టారు ఆర్టీసీ అధికారులు.
అత్యవసరమైతే తప్ప..
చిన్నపిల్లలు, 60 సంవత్సరాలు దాటిన వృద్ధలకు బస్సును ఎక్కనివ్వరు. కరోనా వైరస్ ప్రభావం వారిపైనే తీవ్రంగా ఉండటం వల్ల ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే చిన్నపిల్లలు, వృద్ధలకు ప్రయాణానికి అనుమతి ఇస్తారు. ప్రతి ప్రయాణికుడు కూడా తన స్మార్ట్ఫోన్లో ఆరోగ్య సేతు యాప్ను ఇన్స్టాల్ చేసుకోవడాన్ని తప్పనిసరి చేశారు. అలాగే- ఆన్లైన్ ద్వారా రిజర్వేషన్ చేయించుకునే సమయంలో మొబైల్ ఫోన్ నంబర్ సహా పూర్తి వివరాలను వెల్లడించాల్సి ఉంటుంది. గమ్యస్థానానికి వెళ్లే చిరునామాను కూడా ఇవ్వాల్సి ఉంటుంది.
పరిమితంగా ఏసీ..
వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఏసీ బస్సులను కూడా అనుమతించారు.. పరిమితంగా. బస్సులో ఏసీని 26 డిగ్రీలకు పరిమితం చేశారు. మొదట ఏసీ బస్సులను నడిపించడానికి అనుమతి ఇవ్వకూడదని భావించినా.. వేసవి కాలం కావడం వల్ల తప్పట్లేదని మాదిరెడ్డి ప్రతాప్ తెలిపారు. సాధారణ బస్సుల తరహాలోనే ఇందులో కూడా సీటింగ్ను పరిమితం చేశామని, భౌతిక దూరాన్ని తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని అన్నారు.
ఛార్జీలు పెంచట్లేదు
ఛార్జీలను పెంచట్లేదని ఆయన ప్రతాప్ స్పష్టం చేశారు. లాక్డౌన్కు ముందు ఉన్న ఛార్జీలను ఇప్పుడు కూడా కొనసాగిస్తామని అన్నారు. అదనంగా ఎలాంటి సెస్ వసూలు చేయబోమని చెప్పారు. ఈ లాక్డౌన్ వల్ల శాఖకు 1200 కోట్ల రూపాయల వరకూ నష్టం వచ్చిందని, అయినప్పటికీ.. ప్రయాణికులపై భారాన్ని మోపాలని అనుకోవట్లేదని తేల్చి చెప్పారు. ఆర్థిక వనరులను బలోపేతం చేసుకోవడం, దుర్వినియోగాన్ని అరికట్టడం, అత్యధిక కేఎంపీఎల్ను సాధించడం వంటి చర్యల ద్వారా ఆదాయాన్ని పెంచుకుంటామని అన్నారు.
ఫుల్ ఛార్జీలే..
ప్రయాణ సందర్బంగా ఆర్టీసీ బస్సుల్లో ఎలాంటి రాయితీలను అమలు చేయట్లేదు. స్టూడెంట్ పాసులు, జర్నలిస్ట్ పాసులు సహా ఎలాంటి రాయితీ కార్డులకు అనుమతి ఇవ్వట్లేదని, అదే తరహాలో హాఫ్ టికెట్లను కూడా రద్దు చేశామని అన్నారు. ఫుల్ ఛార్జీని వసూలు చేస్తామని మాదిరెడ్డి ప్రతాప్ తెలిపారు. భౌతిక దూరానికి అనుగుణంగా పల్లె వెలుగు-35, ఎక్స్ప్రెస్-20, అల్ట్రా డీలక్స్-29, సూపర్ డీలక్స్-26 సీట్లు మాత్రమే ఉంటాయని అన్నారు.
అంతర్రాష్ట్ర సర్వీసులకు మరింత సమయం..
అంతర్రాష్ట్ర బస్ సర్వీసులను నడిపించడానికి మరి కొంత సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. పొరుగు రాష్ట్రాల ప్రభుత్వాలను సంప్రదించిన తరువాతే.. వాటిని నడిపిస్తారు. ఈ దిశగా అధికారులు చర్చలను నిర్వహిస్తున్నారు. దూర ప్రాంతాలకు కేవలం నైట్ సర్వీసులు నడపుతామని, పరిస్థితులు కుదుటపడిన తరువాతే డే సర్వీసులను కూడా అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు. బస్సెక్కాలంటే మాస్కులు తప్పనిసరి చేశామని, శానిటైజర్లతో చేతులను శుభ్రం చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు.