APSRTC ఉద్యోగుల నిరసన బాట- రెండో విడత షెడ్యూల్ ప్రకటన..!
ఏపీఎస్ ఆర్టీసీ (APSRTC)లో విద్యుత్ బస్సుల పేరుతో ప్రైవేట్ ఆపరేటర్లకు అవకాశం కల్పిస్తూ వేలకోట్లు విలువైన ఆర్టీసి డిపో స్దలాలను కూడా వారికి కట్టబెట్టడాన్ని నిరసిస్తూ ఉద్యోగులు మరోసారి నిరసనల బాట పట్టబోతున్నారు. దశల వారీగా ఆర్టీసీని ప్రైవేటుపరం చేయాలన్న ప్రభుత్వం ఆలోచనలు విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ చేస్తూ సంస్ద పరిరక్షణ, ప్రజా రవాణా వ్యవస్థ బలోపేతం, పిటిడి(ఆర్టీసి) ఉద్యోగుల డిమాండ్ల సాధన కోసం ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టనున్న రెండవ దశ ఆందోళన కార్యక్రమాల షెడ్యూల్ను ఇవాళ విజయవాడలో విడుదల చేశారు.
విజయవాడ రెవెన్యూ భవన్లో ఆర్టీసి ఉద్యోగసంఘాల జేఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జేఏసీ కమిటి తీసుకున్న నిర్ణయాల మేరకు రెండవ దశ ఆందోళన కార్యక్రమాల షెడ్యూల్ను లిఖితపూర్వకంగా రేపు సీఎం, సీఎస్, రవాణామంత్రి, ఆర్టీసీ ఎండీ, ఇతర అధికారులకు అందించనున్నారు. ఇందులో జూలై 7, 8న రెండు రోజులు "ఏపీఎస్ ఆర్టీసీ పరిరక్షణ దినం" గా పాటిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగులందరూ డిమాండ్లతో కూడిన ప్రింటెడ్ బ్యాడ్జీలు ధరించి విధులు నిర్వహిస్తారు.

జూలై 9 నుండి 18 వరకు ప్రజాప్రతినిధుల మద్దతు కోరే కార్యక్రమం నిర్వహిస్తారు. జూలై 19 నుండి 26 వరకు వినతిపత్రాలపై ఆర్టీసిలో ఉద్యోగులందరితో సంతకాల సేకరణ చేస్తారు. జూలై 27న గ్రీవెన్స్ డే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ల ద్వారా సీఎంకు ఉద్యోగుల సంతకాల సేకరణతో కూడిన వినతిపత్రాలను అందిస్తారు. జూలై 30న జేఏసీ రాష్ట్ర స్దాయి సమావేశం విజయవాడలో నిర్వహించి, మూడవ దశ ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తారు.














Click it and Unblock the Notifications