APSRTC ఉద్యోగుల తాడోపేడో..! మూడో విడత ఉద్యమానికి రెడీ..!
ఏపీలో విద్యుత్ బస్సుల్ని ప్రవేశపెట్టడం, ఆర్టీసీ (APSRTC)డిపోల్ని లీజు ప్రాతిపదికన ప్రైవేటు సంస్ధలకు కట్టబెట్టడాన్ని వ్యతిరేకిస్తూ గత కొంతకాలంగా పలు ఉద్యమాలు చేస్తున్న ఉద్యోగుల జేఏసీ ఇప్పుడు మరోసారి తాడేపేడో తేల్చుకునేందుకు సిద్దమవుతోంది. ప్రభుత్వం తాజాగా ప్రైవేటీకరణ విషయంలో క్లారిటీ ఇచ్చినా అందులో ఉద్యోగులు చెబుతున్న అభ్యంతరాలపై స్పష్టత లేదని ఆరోపిస్తున్న జేఏసీ.. త్వరలో మూడో విడతత ఉద్యం కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించింది.
రాష్ట్రంలో విద్యుత్ బస్సుల నిర్వహణ, మూసివేసిన డిపోల పునరుద్ధరణపై స్పష్టత లేకపోవడంతో ఉద్యమం కొనసాగిస్తామని ఉద్యోగుల జేఏసీ ఇవాళ ఓ ప్రకటన చేసింది. జూలై 14 నుంచి 19 వరకు ప్రజాప్రతినిధులను కలిసి మద్దతు కోరుతూ వినతిపత్రాల సమర్పణ ఉంటుందని, 20 నుండి ఆర్టీసీ ఉద్యోగులందరి సంతకాల సేకరణ చేస్తామని జేఏసీ నేతలు తెలిపారు. జూలై 27 'గ్రీవెన్స్ డే' సందర్భంగా ముఖ్యమంత్రికి ఉద్యోగుల వినతిపత్రం సమర్పిస్తామన్నారు.

జూలై 30న విజయవాడలో ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ రాష్ట్ర సమావేశం ఉంటుందని, ఆ రోజు మూడో దశ ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని జేఏసీ నేతలు వెల్లడించారు. విద్యుత్ బస్సులను ప్రైవేట్ ఆపరేటర్ల ద్వారా నడపొద్దని జేఏసీ ఈ సందర్భంగా డిమాండ్ చేసింది. మూసివేసిన నాలుగు ఆర్టీసీ డిపోలను వెంటనే పునరుద్ధరించాలని జేఏసీ డిమాండ్ చేసింది. మొత్తం 30 డిమాండ్లతో గత నెల 11న యాజమాన్యానికి వినతిపత్రం సమర్పించిన జేఏసీ..జూలై 6, 7, 9 తేదీల్లో అధికారులు-జేఏసీ మధ్య పలుమార్లు చర్చలు కూడా జరిపింది. డ్రాఫ్ట్ మినిట్స్లో స్పష్టమైన హామీలు లేకపోవడంతో రెండో దశ ఉద్యమం కొనసాగించాలని జేఏసీ నిర్ణయించింది. ఇవాళ మరోమారు గూగుల్ మీట్లో జరిగిన జేఏసీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఉద్యమం కొనసాగింపుపై ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగులు, ఆర్టీసీ, ప్రయాణికుల ప్రయోజనాల పరిరక్షణే జేఏసీ లక్ష్యమని తెలిపారు.














Click it and Unblock the Notifications