ఏపీలో ఆర్టీసీ సేవలు రెడీ... చార్జీల బాదుడే బాదుడు..?ఇదీ ప్రభుత్వ వ్యూహం
కరోనా విరామం తర్వాత ఏపీలో ఆర్టీసీ బస్సులు తిరిగి రోడ్ల మీదకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. కరోనా సంరక్షణ చర్యలను పాటిస్తూనే దశల వారీగా బస్సులను నడిపేందుకు ఆర్టీసీ యంత్రాంగం సిద్ధ మవుతోంది. కేంద్రం ప్రకటించిన మూడో దఫా లాక్డౌన్ ఈ నెల 17న ముగుస్తుండటంతో 18వ తేదీ నుంచి ఆర్టీసీ బస్సులను నడిపేందుకు ప్రయత్నాలు ప్రారంభమవుతున్నాయి. బస్సుల్లోను సామాజిక దూరం పాటిస్తూనే కరోనా ప్రభావం లేని ప్రాంతాల్లో నడిపేందుకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. ఇక ఇదే సమయంలో నష్టాలను భర్తీ చేసుకునేందుకు భారీగా చార్జీల పెంపుపైన ప్రజారవాణా శాఖ ప్రతిపాదనలను సిద్ధం చేసింది. దీనిపైన ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
Recommended Video
తెలంగాణలో మరోసారి భారీగా పెరిగిన కరోనా కేసులు
రోడ్లు ఎక్కనున్న ఆర్టీసీ బస్సులు
దాదాపుగా రెండు నెలల పాటు నిలిచిపోయిన ఆర్టీసీ బస్సులను కరోనారహిత ప్రాంతాల్లో తొలుత తిప్పేందుకు ఏపీలోని ప్రజా రవాణా శాఖ సమాయత్తమవుతోంది. కేంద్రం సూచనలను సడలింపుల ఆధారంగా ఈ నెల 18వ తేదీ నుంచి బస్సులను ప్రారంభించే యోచన చేస్తోంది. తక్కువ సంఖ్యలో ప్రారంభించి పరిస్థితులకు అనుగుణంగా సర్వీసులను పెంచాలని భావిస్తోంది. అందుకోసం ప్రణాళికలను సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించింది. లగ్జరీ పల్లెవెలుగు బస్సులను తొలివిడతలో ప్రారంభించనున్నారు. కేంద్రం నుంచి అభ్యంతరాలు లేకుండా ఉండేందుకు బస్సు సీటింగు విధానంలోను మార్పులు చేస్తున్నారు.
కండక్టర్ లేకుండా బస్సులు
ప్రతి డిపో నుంచి ఆరు నుంచి 10 బస్సుల వరకు సిద్ధం చేస్తున్నారు. ఇదే సమయంలో కండక్టర్లు లేకుండా ప్రారంభ స్టేజ్ నుంచి చేరుకునే గమ్యస్థానం వరకు ప్రయాణికులను ఒకే చోట ఎక్కించి డ్రైవర్ ద్వారా మాత్రమే సర్వీసులను కొనసాగించాలనేది తాజా ఆలోచన. కరోనా ప్రభావిత ప్రాంతాలను మండలాలుగా విభజించడంతో రెడ్ జోన్ మండలాలను మినహాయించి మిగిలిన మండలాల్లో ఈ సర్వీసులు ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటుగా సరుకు రవాణాకు సైతం ఆర్టీసీ బస్సులను విరివిగా వినియోగించుకోవాలనే ప్రతిపాదన ప్రభుత్వం ముందుకు వచ్చింది.
కేసీఆర్ తరహాలో జగన్ నిర్ణయం
నష్టాల్లో ఉన్న ఆర్టీసీని కాపాడుకునేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తరహాలోనే జగన్ అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. తెలంగాణలో సుదీర్ఘంగా సాగిన ఆర్టీసీ సమ్మె తర్వాత సమ్మె విరమణ సమయంలో ఆర్టీసీని కాపాడుకోవాలంటే చార్జీలు పెంచక తప్పదని కేసీఆర్ స్పష్టం చేశారు అదే విధంగా పెంచారు. ఏపీలో ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు. సంస్థ మాత్రం ఇంకా భారీ నష్టాల్లో ఉంది. కరోనావైరస్ కారణంగా 50 రోజుల పాటు పూర్తిగా సర్వీసులు నిలిచిపోయి. ఇప్పుడు ఆర్టీసీ చార్జీలు పెంచక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇందుకోసం ప్రజారవాణా శాఖ ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించినట్లు విశ్వసనీయ సమాచారం. ఆర్టీసీ నష్టాలను భర్తీ చేసుకోవాలంటే 40 నుంచి 50శాతం వరకు చార్జీలను పెంచాలని ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఈ ప్రతిపాదనలపైన చర్చించి ప్రభుత్వం ఎంతమేర పెంచుతుందనేది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
తుది నిర్ణయం ఎప్పుడంటే..?
ప్రభుత్వ ఉద్యోగులుగా ఆర్టీసీ కార్మికులను గుర్తించడం నిర్వహణ ఖర్చులు భారీగా ఉండటంతో చార్జీలు పెంచక తప్పదని అధికారులు చెబుతున్నారు. వచ్చే కేబినెట్ సమావేశంలో దీనిపైన తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇదే సమయంలో కొన్ని బస్సులను అంతరాష్ట్ర, అంతర్జిల్లాల మధ్య కార్గో సర్వీసుల కోసం ఉపయోగించుకునే ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. కార్గో సేవల ద్వారా ఆదాయం పెరుగుతుందనే అంచనాతో ప్రభుత్వం ఉంది. ఆర్టీసీ సర్వీసులు తిరిగి ప్రారంభమవుతున్న సమయంలోనే చార్జీలపైన ప్రభుత్వం తీసుకునే నిర్ణయం పై ఉత్కంఠ నెలకొని ఉంది.