ఉచిత ప్రయాణం ఇక ఆ బస్సుల్లోనూ అమలు -ఇవి తప్పనిసరి, తాజా ప్రకటన..!!
ఏపీ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోంది. ఆగస్టు 15న ప్రారంభించిన ఈ పథకానికి మంచి స్పందన కనిపిస్తోంది. ప్రభుత్వం పథకం అమలు పైన నిత్యం వివరాలు సేకరిస్తోంది. మరింత పకడ్బందీగా ఈ పథకం అమలు కోసం తాజాగా సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఘాట్ రోడ్లలోనూ పథకం అమలు చేయాలని డిసైడ్ అయ్యారు. కాగా, ఈ పథకాన్ని ఇక మరో కేటగిరీలోనూ అమలు చేసేందుకు రంగం సిద్దమైంది.
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు పథకం ఆర్టీసీలో అయిదు కేటగిరీల బస్సుల్లో అమలవుతోంది. తొలుత ఘాట్ రోడ్లు ఉన్న ప్రాంతాల్లో ఈ పథకం అమలుకు నిరాకరించారు. అయితే, ప్రభుత్వం ఆ తరువాత ఘాట్ రోడ్లలో వెళ్లే సర్వీసుల్లోనూ అనుమతించాలని ఆదేశించింది. ఫలితంగా తిరుమల కొండ మీదకు ఉచిత బస్సు అమలు చేస్తున్నారు. అదే విధంగా బస్సులకు నేమ్ బోర్డులతో పాటుగా ఉచిత సర్వీసులకు లైవ్ ట్రాకింగ్ ఏర్పాటు పైన తాజాగా ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు. ఇదే సమయంలో ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు కీలక ప్రకటన చేసారు. త్వరలో ఆర్టీసీకి 1500 ఎలక్ట్రికల్ ఏసీ బస్సులు రానున్నాయని, వాటిలోనూ స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని ఎండీ వెల్లడించారు. మహిళలు నిర్దేశించిన గుర్తింపు కార్డు తప్పనిసరిగా వినియోగించి ఈ పథకం వినియోగించుకోవాలని సూచించారు.

ఉచిత బస్సు పథకం అమలు చేస్తున్న పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే మనకు ఇక్కడ ఎలాంటి సమస్యలు రాలేదని తిరుమల రావు చెప్పారు. పక్క రాష్ట్రాల్లో మహిళలు, పురుష ప్రయాణీకుల నిష్పత్తి 63-37 శాతం ఉండగా మన రాష్ట్రంలో 70-30 గా ఉందని వివరించారు. గతంలో పోలిస్తే మహిళా ప్రయాణీకులు పెరిగారని పేర్కొన్నారు. స్త్రీ శక్తి పథకం కోసం పాత రూట్లు రద్దు చేసే ఆలోచన ఏదీ లేదని స్పష్టం చేసారు. అవసరమైతే డిమాండ్ కు అనుగుణంగా మరిన్ని బస్సులు ఏర్పాటు చేస్తామని ఎండీ ప్రకటించారు. ఇక.. అటు ఉచిత బస్సు పథకంతో తాము నష్టపోతున్నామని ఆందోళన చేస్తున్న ఆటో కార్మికుల విషయంలోనూ ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. వీరికి ఎలాంటి సాయం అందించాలనేది వచ్చే నెల 4న జరిగే కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు.












Click it and Unblock the Notifications