లాక్ డౌన్ ఎఫెక్ట్ : ఏపీఎస్ఆర్టీసీ యూటర్న్.. బుకింగ్స్పై కీలక ప్రకటన
ఏపీఎస్ఆర్టీసీ యూటర్న్ తీసుకుంది. లాక్ డౌన్ పొడగింపుపై సర్వత్రా చర్చ జరుగుతున్నవేళ.. ఏప్రిల్ 15వ తేదీ నుంచి బుకింగ్స్ ప్రారంభించాలని నిర్ణయించిన ఏపీఎస్ఆర్టీసీ.. తాజాగా నిర్ణయం మార్చుకుంది. లాక్ డౌన్ పొడగించే అవకాశం ఉండటంతో రిజర్వేషన్ బుకింగ్స్ నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే ఆన్లైన్లో రిజర్వేషన్లు చేసుకున్న ప్రయాణికులకు నగదు వెనక్కి ఇవ్వనున్నట్లు తెలిపింది. ప్రభుత్వం నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చాకే రిజర్వేషన్లు తిరిగి ప్రారంభిస్తామని వెల్లడించింది.
కాగా, సూపర్ లగ్జరీ,అల్ట్రా డీలక్స్ బస్సులకు ఏప్రిల్ 15వ తేదీ నుంచి రిజర్వేషన్లు ప్రారంభించాలని మొదట ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. అది కూడా విజయవాడ బస్ స్టేషన్ నుంచి వెళ్లే సర్వీసులను మాత్రమే అనుమతించనుంది. మొత్తంగా 115 బస్సు సర్వీసులకు టికెట్ బుకింగ్స్ ప్రారంభించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దశలవారీగా లాక్ డౌన్ను ఎత్తివేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగానే ఏపీఎస్ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుందని అంతా భావించారు. అయితే దేశంలో కేసుల సంఖ్య పెరుగుతుండటంతో కేంద్రం కూడా లాక్ డౌన్ పొడగింపుపై సమాలోచనలు జరుపుతోంది. ఇదే క్రమంలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్.. తమ రాష్ట్రంలో ఏప్రిల్ 30 వరకు లాక్ డౌన్ కొనసాగిస్తున్నట్టు తెలిపారు. అదే సమయంలో అన్ని విద్యాసంస్థలను జూన్ 17వరకు మూసే ఉంచుతామన్నారు.
అటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా లాక్ డౌన్ను పొడగించాలని ప్రధానికి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ప్రధాని మోదీ అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నారు. ఈ నెల 11న ముఖ్యమంత్రులతో మరోసారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులు.. లాక్ డౌన్పై అనుసరించాల్సిన వ్యూహాలను ముఖ్యమంత్రులతో చర్చించనున్నారు. ఈ సమావేశం తర్వాత లాక్ డౌన్ పీరియడ్ పొడగింపుపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. లాక్ డౌన్ పొడగింపుకు ఎక్కువ అవకాశాలున్న నేపథ్యంలోనే ఏపీఎస్ఆర్టీసీ బుకింగ్స్ను నిలిపివేసింది.