ఉద్యోగులకు ఏపీఎస్ ఆర్టీసీ భారీ షాక్... ఒకేసారి 6 వేల మంది తొలగింపు...కరోనా కారణం...
దేశవ్యాప్తంగా అన్ని రంగాలను కుదిపేస్తున్న కరోనా వైరస్ ప్రభావం జనజీవనాన్ని అతలాకుతలం చేస్తోంది. లక్షలాది మంది ఉద్యోగుల ఉసురుపోసుకుంటోంది. కరోనా వైరస్ కారణంగా నష్టాల్లో కూరుకుపోతున్న ప్రైవేటు సంస్ధలు ఇప్పటికే ఉద్యోగుల తొలగింపుకు ఒక్కొక్కటిగా ఆదేశాలు జారీ చేస్తుండగా.. తాజాగా ప్రభుత్వ శాఖలు కూడా ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు సిబ్బందిని వదిలించుకునేందుకు సిద్దమవుతున్నాయి. ఇదే కోవలో ఏపీలో ప్రజా రవాణాశాఖ జారీ చేసిన తాజా ఆదేశాలు కలకలం రేపుతున్నాయి.
ఏపీలో ఆర్టీసీ సర్వీసుల ప్రారంభం అప్పుడే.. ప్రభుత్వం కీలక నిర్ణయం..
కరోనా వైరస్ లాక్ డౌన్ ప్రారంభమైన నాటి నుంచి బస్సులను నడిపేందుకు వీలు లేకపోవడంతో ఏపీఎస్ఆర్టీసీ తీవ్ర నష్టాల్లో కూరుకుపోయింది. ఇప్పటికే ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేసుకోవడం ద్వారా భారీ ఆర్ధిక భారాన్ని మోస్తున్న ప్రభుత్వానికి ఆర్టీసీ నష్టాలు తలనొప్పిగా పరిణమించాయి. అయితే లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో ఈ నెల 18 నుంచి వీలున్న చోట్ల బస్సులు నడిపేందుకు సిద్దమవుతున్న ఆర్టీసీ.. ఆ మేరకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా కండక్టర్లు లేకుండానే బస్సులు నడపాలని తీసుకున్న నిర్ణయం వేలాది మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పాలిట శాపంగా మారబోతోంది.
బస్సులను పరిమిత సంఖ్యలోనే నడపాలని ఆర్టీసీ నిర్ణయించుకున్న నేపథ్యంలో ప్రైవేటు కాంట్రాక్టు బస్సులకు మంగళం పాడటం ఖాయంగానే కనిపిస్తోంది. అదే సమయంలో తక్కువ బస్సులు నడపడం ద్వారా మిగిలిన డ్రైవర్లకు, కండక్టర్లకు కూర్చుబెట్టి జీతాలు ఇవ్వాల్సిన పరిస్ధితి. దీంతో వీరిని ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు సిబ్బంది ఉన్న చోట్ల సర్దుబాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీరి రాకతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 6 వేల మంది ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు సిబ్బంది ఉద్యోగాలు కోల్పోనున్నారు. ఇప్పటికే ఇళ్ల వద్ద ఉంటున్న వీరంతా ఇక విధులకు రావాల్సిన అవసరం లేదని డిపో మేనేజర్లు ఆదేశాలు జారీ చేయబోతున్నట్లు తెలుస్తోంది.