APSRTC దసరా స్పెషల్ 4 వేల బస్సులు-50శాతం ఎక్స్ ట్రా ఛార్జీలు-ఏయే తేదీల్లో తెలుసా ?
నష్లాల్లో కూరుకుపోతున్న ఏపీఎస్ ఆర్టీసీకి ఈ దసరా సీజన్ కలిసొచ్చేలా ఉంది. దసరా సీజన్ లో పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక బస్సుల్ని ఏపీఎస్ఆర్టీసీ ఇవాళ ప్రకటించింది. ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ఈ వివరాలను వెల్లడించారు. దీని ప్రకారం ఎన్ని బస్సులు, ఏయే తేదీల్లో, ఎంత అదనపు ఛార్జీలతో నడపబోతున్నారో వివరించారు.
ఏపీఎస్ఆర్టీసీ ఈ దసరా సీజన్ రద్దీని దృష్టిలో ఉంచుకుని మొత్తం 4 వేల బస్సుల్ని నడపాలని నిర్ణయించింది. ఇందులో అదనంగా 50 శాతం ఛార్జీని వసూలు చేయాలని నిర్ణయించినట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ప్రకటించారు. అలాగే ఈ బస్సులు ఈ నెల 8 నుంచి 18వ తేదీ వరకూ నడపనున్నట్లు ఆయన వెల్లడించారు. అయితే రోజూ నడిచే రెగ్యులర్ సర్వీసుల్లో మాత్రం పండుగ సీజన్లోనూ అదనపు ఛార్జీలు వసూలు చేయరాదని నిర్ణయించారు. దీంతో ఈ నాలుగువేల బస్సుల్లో మాత్రం అదనపు మోత తప్పడం లేదు.

గతేడాదితో పోలిస్తే ఈ దసరా పండుగ సీజన్లో ఆర్టీసీ పూర్తిస్దాయిలో బస్సుల్ని నడిపేందుకు అవకాశం లభించింది. కరోనా వ్యాప్తి తగ్గడం, ప్రజల్లో ఆ మేరకు భయాలు కూడా తగ్గడంతో ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయి. ఇప్పుడు దసరా సీజన్లోనూ అదనపు బస్సుల్ని నడపడం ద్వారా నష్టాల్ని కాస్తయినా తగ్గించుకోవాలని అధికారులు భావిస్తున్నారు. దీంతో స్పెషల్ బస్సుల్ని ఎప్పటిలాగే అదనపు ఛార్జీలతో నడిపేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు డీజిల్ ధరల పెరుగుదలతో సంస్ధపై భారం పెరుగుతోందని, దీంతో నిర్వహణ వ్యయం తగ్గించుకనేందుకు ఎలక్ట్రికల్ బస్సులు అందుబాటులోకి తెస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు తెలిపారు.
ప్రస్తుతం ఆర్టీసీ నష్టాల్లో ఉన్నా, ఇంధన ధరలు పెరుగుతున్నా ఛార్జీల పెంపు మాత్రం ఉండబోదని ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ నష్టాలు, ఇతర సమస్యలను త్వరలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఆయన వెల్లడించారు. దసరా సీజన్ లో నష్టాల్ని కొంతమేర తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications