నాపై నిందులు వేయడానికేనా: విభజనపై కిరణ్ రెడ్డి
హైదరాబాద్: "నాకు వినతి పత్రాన్ని ఇచ్చేశామని.. ఇక, తీర్మానం, బిల్లు అసెంబ్లీకి వచ్చేలా చూసే బాధ్యత నాదే అని చెప్పి.. అవి రాకపోతే నాపై నిందలు వేయడానికేనా ఈ ఫొటో'' అని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధులు వినతిపత్రం సమర్పిస్తూ ఫొటో తీసుకోవడంపై ఆయన శనివారం ఆ విధంగా ప్రతిస్పందించారు. రాష్ట్ర విభజన అంశం అంత తేలిక కాదని, ఇతర రాష్ట్రాలకు, ఆంధ్రప్రదేశ్కు భౌగోళికంగా చాలా వ్యత్యాసం ఉందని తెలిపారు. రాష్ట్రం సమైక్యంగా ఉండేలా చివరి వరకూ పోరాడతానని చెప్పారు.
ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల ఫోరం కన్వీనర్ శైలజానాథ్ నేతృత్వంలో ఎమ్మెల్సీలు పాలడుగు వెంకట్రావ్, రుద్రరాజు పద్మరాజు, గాదె శ్రీనివాసులు నాయుడు, ఎమ్మెల్యేలు కన్నబాబు, విజయ్ తదితరులు శనివారం ముఖ్యమంత్రిని కలిశారు. ఆయనకు ఒక వినతి పత్రం అందించారు.
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మన్మోహన్ సింగ్లకు ఫోరం విజ్ఞప్తి చేసింది. వీరికి శనివారం రెండుపేజీల లేఖలను విడి విడిగా ఫోరం కన్వీనర్ శైలజానాథ్ పంపారు. విభజన నిర్ణయం తీసుకున్న తీరు, ప్రక్రియను ముందుకు తీసుకువెళ్తున్న ధోరణితో తాము నిస్పృహకు లోనయ్యామని అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం అసెంబ్లీలో చర్చించకుండా రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లు పార్లమెంటు ఆమోదానికి వెళ్లదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. శాసనసభకు తీర్మానం, ముసాయిదా బిల్లు రెండూ వస్తాయని తాము నమ్ముతున్నామని అన్నారు.
రాష్ట్ర విభజన అంశంలో రాజ్యాంగ పద్ధతులు, విధానాలు, సంప్రదాయాలను పాటించేలా కేంద్రాన్ని ఒప్పించాలని, ఓటింగ్ కోసం తీర్మానం, సభ్యుల అభిప్రాయ సేకరణకు ముసాయిదా బిల్లు శాసనసభకు వచ్చేలా ఒత్తిడి తీసుకు రావాలని వారు ముఖ్యమంత్రిని కోరారు. శాసనసభకు తీర్మానం, ముసాయిదా బిల్లు రెండూ రావాలని నేను కూడా కోరుకుంటున్నానని కిరణ్ రెడ్డి చెప్పారు. కేంద్ర మంత్రులు, అధిష్ఠానం పెద్దలను కూడా కోరుతున్నానని, కానీ, వారి నుంచి స్పష్టత రావడం లేదని చెప్పారు.