TTD: తిరుమలలో ‘ఏరియా డామినేషన్’ - ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్..!!
Tirumala: తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు కావటంతో టీటీడీ ముందస్తు ఏర్పాట్లు చేసింది. సాధారణ భక్తులకు ప్రాధాన్యత కల్పించేందుకు బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. ప్రోటోకాల్ పరిధిలోని వ్యక్తులు నేరుగా వస్తే వారికి అవకాశం కల్పిస్తున్నారు. ఇక, భారత్ - పాకిస్తాన్ మధ్య యుద్ధవాతావరణం నెలకొనివున్న నేపథ్యంలో శుక్రవారం తిరుమలలో ఏరియా డామినేషన్ కార్యక్రమం నిర్వహించారు. భక్తులకు భరోసా కల్పించేందుకు టీటీడీ అధికారులు నిర్ణయాలు తీసుకుంటున్నారు.
ఏరియా డామినేషన్
ఆపరేషన్ సింధూర్ వేళ తిరుమలలో భద్రత కట్టుదిట్టం చేసారు. అందులో భాగంగా 130 మంది ఆక్టోపస్, పోలీసు, నిఘా మరియు భద్రత విభాగం, బాంబ్, డాగ్ స్క్వాడ్ బృందాల అధికారులు, సిబ్బంది నాలుగు బృందాలుగా విడిపోయి ఏరియా డామినేషన్ నిర్వహించారు. భారత్-పాక్ వార్ నేపథ్యంలో భక్తుల్లో ధైర్యాన్ని నింపేలా ముందస్తు జాగ్రత్తగా ఏరియా డామినేషన్ నిర్వహించిన సిబ్బంది తిరుమలలో శ్రీవారి ఆలయం, కాటేజీలు, బస్టాండ్ వంటి రద్దీ ప్రాతాల్లో తనిఖీలు కొనసా గించారు. అనుమానిత వ్యక్తులను ప్రశ్నించడంతో పాటు బ్యాగులను క్షుణ్ణంగా తనిఖీలు చేసారు. ఈ తరహా తనిఖీలతో భక్తులకు భరోసా నింపటమే తమ లక్ష్యమని అధికారులు ప్రకటించారు.

ఇక ప్రతీ రోజూ
తిరుమలలో ఇప్పటి నుండి ప్రతిరోజు తిరుమల తిరుపతి దేవస్థానాల భద్రతా వ్యవస్థ ఎంత అప్రమత్తంగా వుందో దుండగులకు ఒక హెచ్చరిక లాగా ఈ తరహా కార్యక్రమాలు కొనసాగిస్తామని డీఎస్పీ విజయ్ కుమార్ వెల్లడించారు. శ్రీవారి వారి భక్తులకు భరోసా లాగా సందేశం ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇందులో ఆక్టోపస్, పోలీస్, టిటిడి నిఘా మరియు భద్రత సిబ్బంది పాల్గొంటున్నట్లు చెప్పారు. ఏరియా డామినేషన్ భద్రత సిబ్బంది నాలుగు గ్రూపులుగా విడిపోయి సిఆర్ఓ మరియు ఆర్ టిసి బస్టాండ్, శ్రీవారి ఆలయం, నందకం పరిసర ప్రాంతాలు, ఎంబిసి మరియు శ్రీవారి మెట్టు తదితర ప్రాంతాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వివరించారు.
హై అలర్ట్
ఇక తిరుపతి విమానాశ్రయంలో హై అలర్ట్ కొనసాగుతోంది. యుద్ధ వాతావరణం నేపధ్యంలో దేశంలోని విమానాశ్రయాల భద్రత పై కేంద్రం ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. దీంతో, తిరుపతి విమానాశ్రయం అధికారులతో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు అత్యవసర సమావేశం నిర్వహించారు. ఎయిర్పోర్ట్ భద్రత పై సమీక్ష చేశారు. ప్రతి ప్రయాణికుడ్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపాలని ఆదేశించారు. అనుమానిత వస్తువులు, ప్రయాణికుల లగేజీ ని డాగ్ స్క్వాడ్ తో తనిఖీ చేసి అనుమతించాలని విమానాశ్రయ భద్రత సిబ్బందికి సూచించారు. సిఐఎస్ఎఫ్, ఆక్టోపస్, జిల్లా పోలీసు అధికారులతో సమీక్ష సమావేశంలో పాల్గొనగా ఈ మేరకు భద్రతా చర్యలపై జిల్లా ఎస్పీ దిశా నిర్దేశం చేశారు.












Click it and Unblock the Notifications