ఆనం వివేకాకు అరెస్ట్ వారెంట్...రోజాపై అనుచిత వ్యాఖ్యల వ్యాజ్యంలో..షాకిచ్చిన కోర్టు
సంచలనాలకు పెట్టింది పేరైన ఆనం వివేకానందరెడ్డికి గట్టి ఎదురు దెబ్బే తగిలింది. వైసిపి ఎంఎల్ఏ రోజాపై గతంలో చేసిన అనుచిత వ్యాఖ్యలపై కోర్టు సీరియస్ గా స్పందించింది. ఎన్నిసార్లు సమన్లు జారీ చేసినా కోర్టుకు రాని ఆనం వివేకాకు కోర్ట్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
గతంలో వైసిపి ఎమ్మెల్యే రోజా గురించి ఆనం వివేకానందరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై ఆమె క్షమాపణ చెప్పాలని కోరితే అందుకు ప్రతిగా మరిన్ని వ్యాఖ్యలు చేశారు ఆనం వివేకా.దీంతో రోజా తన పరువుకు భంగం కలిగిందంటూ ఆనం వివేకాపై నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు. రోజాపై ఆనం అభ్యంతర వ్యాఖ్యలను కోర్టు సీరియస్ గా పరిగణించినట్లు తెలుస్తోంది. పైగా ఆనం వ్యాఖ్యలైతే చేశారు కానీ ఆ కేసు విషయమై వివరణ ఇచ్చేందుకు ఒక్కసారి కూడా కోర్టుకు రాలేదు. దాంతో నాంపల్లి కోర్టు వివేకాకు అరెస్టు వారెంటును జారీ చేసినట్లు తెలిసింది.
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా దాఖలు చేసిన పరువునష్టం కేసులో రోజా తరఫున వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదించారు. 2016, ఫిబ్రవరి 29న వివేకానందరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ రోజాను కించపరిచేలా, ఆమె పరువుకు భంగం కలిగేలా పలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సీడీని న్యాయస్థానానికి సమర్పించారు. ఆధారాలను పరిశీలించిన న్యాయమూర్తి పిటిషన్ను విచారణకు స్వీకరించి...వివేకానందరెడ్డికి సమన్లు జారీ చేశారు.
అయితే ఎన్నిసార్లు సమన్లు జారీ చేసినా ఆనం వివేకా కోర్టుకు హాజరుకానట్లు తెలుస్తోంది. ఇందుకు ఆయన అనారోగ్యం కూడా కారణమంటున్నారు. ఇటీవలి కాలంలో ఆనం వివేకానందరెడ్డి తీవ్ర అస్వస్థతకు గురైనట్లు మీడియాలో వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో కోర్టు జారీ చేసిన అరెస్టు వారెంటు ఆనం వివేకాకు ఇబ్బంది కలిగించేదే.