పేరేదైనా: బాబు ఆగ్రహంపై జైట్లీ! అమిత్ హామీ: త్వరలో ఏపీకి మరిన్ని...
న్యూఢిల్లీ/విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా పైన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నిలదీయడంతో... కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసకుంటామని, తుది నిర్ణయానికి వస్తే మీతో మాట్లాడుతామని చెప్పారని తెలుస్తోంది.
ప్రత్యేక హోదా ఉద్యమం వేడెక్కుతున్న నేపథ్యంలో చంద్రబాబు కేంద్రమంత్రులకు ఫోన్ చేసిన విషయం తెలిసిందే. వెంకయ్య, జైట్లీలతో పాటు బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్ షాకు ఫోన్ చేశారు. హోదా గురించి నిలదీశారు.
తనను కలిసిన ఏపీ టిడిపి ఎంపీలతోను ప్రత్యేక హోదా పైన అరుణ్ జైట్లీ వివరణ ఇచ్చారు. పేరుకు ఏదైనా హోదా కంటే ఎక్కువే ఇస్తామని చెప్పారు. రాష్ట్ర అవసరాలకు, ఆకాంక్షలకు తగ్గకుండా సాయం చేస్తామని చెప్పారు. అడుగు ముందుకేసి మరీ ఆదుకుంటామని చెప్పారు. ప్రత్యేక హోదాను 14వ ఆర్థిక సంఘం సిఫార్సు చేయలేదని చెప్పారని తెలుస్తోంది.
అతి త్వరలో ఏపీకి మరిన్ని ప్రకటనలు ఉంటాయని చెప్పారు. పది రోజుల్లో సమస్యలను పరిష్కరిస్తామని కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. మంగళవారం నాడు టిడిపి ఎంపీలు కేంద్రమంత్రులను కలిసినప్పుడు వారు హోదాపై స్పందించారు.
అమిత్ షా సముదాయింపు!
ప్రత్యేక హోదా పైన ఘాటుగా స్పందించిన చంద్రబాబు... అమిత్ షాకు కూడా ఫోన్ చేశారు. అమిత్ హోదా పైన వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారని తెలుస్తోంది.
ఏపీలో ఉన్న ప్రత్యేక పరిస్థితిని అర్థం చేసుకున్నామని, తొందరపడవద్దని, కొంత సమయం ఇవ్వాలని సూచించారని తెలుస్తోంది. దీంతో రాజకీయంగా ఎదురయ్యే ఇబ్బందులను చంద్రబాబు.. అమిత్ షాకు వివరించారు. ఒకటి రెండు రోజుల్లో సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన ముఖ్య సమస్యల పైన ఒక నిర్ణయానికి వస్తామని బిజెపి పెద్దలు చెప్పారని సమాచారం.