చంద్రబాబుకు జైట్లీ ఫోన్: నోట్ల రద్దుపై సబ్ కమిటీ! సారథ్యం వహించాలని విన్నపం..
నోట్ల రద్దుతో పాటు నగదు రహిత లావాదేవీలపై చర్చించేందుకు ఐదు రాష్ట్రాల సీఎంలతో సబ్ కమిటీ వేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది.
విజయవాడ : పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో.. దేశంలో సామాన్యులు కష్టాలు మరింత తీవ్రతరం అవుతుండడం.. చాలాచోట్ల బ్యాంకులు, ఏటీఎంల నుంచి పూర్తిస్థాయి సేవలు అందని పరిస్థితి నెలకొంది. మరోవైపు దేశంలోని పలు ప్రతిపక్షాలు నోట్ల రద్దుని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనకు దిగుతున్న సంగతి తెలిసిందే.
ఇలాంటి తరుణంలో పరిస్థితి చేజారిపోకుండా జాగ్రత్తపడుతోంది కేంద్రం. ఈ నేపథ్యంలోనే నోట్ల రద్దుతో పాటు నగదు రహిత లావాదేవీలపై చర్చించేందుకు ఐదు రాష్ట్రాల సీఎంలతో సబ్ కమిటీ వేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. ఇదే విషయమై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఫోన్ చేసిన కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ.. సబ్ కమిటీకి సారథ్యం వహించాల్సిందిగా కోరినట్టు తెలుస్తోంది.
జైట్లీతో ఫోన్ కాల్ సందర్బంగా.. నోట్ల కష్టాలపై రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితి గురించి ఆయనకు వివరించారు చంద్రబాబు. మరిన్ని ఎక్కువ నోట్లను రాష్ట్రానికి పంపించాలని ఆర్బీఐకి లేఖలు రాస్తున్నప్పటికీ.. పెద్దగా ప్రయోజనం ఉండట్లేదని జైట్లీతో చంద్రబాబు వాపోయినట్టు సమాచారం. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆర్బీఐకి లేఖలు పోటెత్తుతున్న నేపథ్యంలో తక్షణం పరిస్థితిని పూర్తిస్థాయిలో సమీక్షించాలన్న ఉద్దేశ్యంతో.. కేంద్రం సబ్ కమిటీ ప్రతిపాదన తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది.