ప్రత్యేక హోదాల శకం ముగిసింది: జైట్లీ, ఎపికీ ఇక లేనట్లే..
పాట్నా: ప్రత్యేక హోదా శకం ముగిసిపోయిందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. బీహార్ను దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ మాటలు అన్నప్పటికీ అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా వర్తిస్తుందని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. బీహార్కు ప్రత్యేక హోదా కల్పించాలన్న ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ డిమాండ్ను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తోసిపుచ్చుతూ ఆయన స్పెషల్ స్టేటస్ కా దౌర్ సమాప్త్ హో చుకా హై అని అన్నారు.
పన్నుల ఆదాయాన్ని కేంద్రం, రాష్ట్రాల మధ్య పంపిణీకి 14వ ఆర్థిక సంఘం రాజ్యాంగం ప్రకారం ఏర్పాట్లు చేసిన తర్వాత ప్రత్యేక ప్యాకేజికి అర్థం లేదని అన్నారు. జైట్లీ గురువారం ఇక్కడ మీడియా సమావేశంలో మాట్లాడారు. బీహార్కు ప్రత్యేక హోదా డిమాండ్ గురించి జైట్లీ ఈ వ్యాఖ్యలు చేసినప్పటికీ తమకు కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్న ఆంధ్రప్రదేశ్, మరి కొన్ని రాష్ట్రాలకు కూడా ఇదే సూత్రం వర్తిస్తుందని ఆయన పరోక్షంగా చెప్పినట్లయింది.
14వ ఆర్థిక సంఘం రాష్ట్రాలకోసం రాజ్యాంగ అవార్డును ప్రకటించి, కేంద్రం, రాష్ట్రాల మధ్య పన్నుల రాబడిని పంచడానికి ఒక ఫార్ములాను రూపొందించిందని ఆయన చెప్పారు. బీహార్ గురించి మాట్లాడుతూ - ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇప్పటికే రాష్ట్రానికి రూ.1.25 లక్షల కోట్ల ప్రత్యేక ప్యాకేజిని ప్రకటించారని, ఇదే కాకుండా ప్రస్తుతం అమలవుతున్న ప్రాజెక్టుల పూర్తికోసం మరో 40 వేల కోట్లు ప్రకటించారని జైట్లీ చెప్పారు.
ఇదే కాకుండా బీహార్కు మరిన్ని నిధులు ఇవ్వాలని కేంద్రం అనుకుంటోందని ఆయన చెప్పారు. లక్షా 65 వేల కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజి వల్ల రాబోయే సంవత్సరాల్లో బీహార్కు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని జైట్లీ చెప్తూ, ఈ ప్యాకేజిని పాత పథకాల రీ ప్యాకేజింగ్గా అభివర్ణించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రతికూల ధోరణిని దుయ్యబట్టారు.
బిహార్లో ఇంతకు ముందు జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ విజయం సాధించడానికి తెరవెనుక వ్యూహ రచన చేసింది జైట్లీయేననేది అందరికీ తెలిసిందే. కాగా, ఈ సారి కూడా బిజెపి నేతృత్వంలోని కూటమి ఘన విజయం దిశగా దూసుకు పోతోందని జైట్లీ అన్నారు. ఇప్పటివరకు జరిగిన మూడు దశల పోలింగ్లో ఎన్డీఏకు అనుకూలంగా భారీ మద్దతు లభించినట్లు తనకు కనిపిస్తోందని, మిగిలిన రెండు విడతల్లో కూడా ఇదే ధోరణి కొనసాగుతుందని నమ్మడానికి బలమైన కారణాలున్నాయని ఆయన చెప్పారు.