ఎంపీలకి అశోక్ అల్టిమేటం: రాజధానిలో జగన్ సభ 19న!
హైదరాబాద్: ప్రజలు కావాలా లేక పదవులు కావాలా సీమాంధ్ర ప్రాంత పార్లమెంటు సభ్యులు తేల్చుకోవాలని ఎపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు మంగళవారం ఎంపీలను హెచ్చరించారు. సిఎస్తో మాట్లాడితే సమ్మె సమస్య తీరేది కాదన్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో అయితేనే సమస్యకు పరిష్కారం దొరుకుందని చెప్పారు. ముఖ్యమంత్రి చర్చ జరిపితేనే తాము వస్తామని తేల్చి చెప్పారు.
ఆంటోని కమిటీని తాము కలిసేది లేదన్నారు. ఆ కమిటీ పైన కాంగ్రెసు పార్టీకే ఎలాంటి స్పష్టత లేదని చెప్పారు. ఎంపీలు అందరు సమైక్యాంధ్ర కోసం రాజీనామా చేయాలన్నారు. లేదంటే వారి ఇళ్ల వద్ద ధర్నా చేస్తామని హెచ్చరించారు. బుధవారం మహాత్మా గాంధీ విగ్రహాల వద్ద శాంతి ర్యాలీలు చేస్తామన్నారు. ఎంపీలు రాజీనామాలు చేసి ఢిల్లీ అధికారిక నివాసాలు ఖాళీ చేస్తేనే ప్రజలు నమ్ముతారన్నారు.
రాజీనామాలపై వారికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా జీతభత్యాలు తీసుకోవద్దని, ఢిల్లీలో ఉన్న నివాసాలు ఖాళీ చేయాలన్నారు. రాజీనామాలు సాంకేతికంగా ఎలా ఉన్నా నైతికంగా పదవుల నుండి తప్పుకోవాలన్నారు. రాజీనామాలు ఆమోదించే వరకు నియోజకవర్గాల్లో ఉండాలన్నారు. ప్రయివేటు విద్యా సంస్థల మూసివేతపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. పదిహేనవ తేదీ వరకు సమ్మెను కొనసాగించి తీరుతామన్నారు.
హైదరాబాదులో జగన్ పార్టీ సభ 19న!
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 19వ తేదిన సమైక్య శంఖారావం సభ జరగనుంది. ఆ పార్టీ నేత కొణతాల రామకృష్ణ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సమైక్యాంధ్ర ఉద్యమం ఇకపై ఉధృతం చేస్తామని తెలిపారు. రేపటి నుండి నవంబర్ ఒకటవ తేది వరకు కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.
జగన్ ప్రకటించినట్లుగా 15-20 మధ్య హైదరాబాదులో సమైక్య సభ జరగనుందన్నారు. ఈ నెల 19న జరిగే అవకాశముందని చెప్పారు. హైదరాబాదు తమ రాష్ట్ర రాజధాని కాబట్టి ఇక్కడ సభ నిర్వహిస్తున్నామని చెప్పారు. పార్టీలు రాజకీయాలకతీతంగా సభను విజయవంతం చేయాలన్నారు. తమ పార్టీ నాయకురాలు షర్మిల వ్యాఖ్యలను వక్రీకరించవద్దన్నారు.