సోది వినడానికా: మైక్ లాక్కున్న అశోక్ గజపతి
గుంటూరు: పౌర విమాన యానాల మంత్రి పి. అశోక్ గజపతి రాజు తన సహజశైలికి భిన్నంగా వ్యవహరించారు. తన సహనానికి నిర్వాహకులు పరీక్ష పెట్టడమే అందుకు కారణం. ‘వాళ్లు అడిగిన దానికి సమాధానం చెప్పకుండా మీ ఉపన్యాసాలేమిటి? కథలు చెప్పకుండా ముందు క్లారిఫికేషన్ ఇవ్వండి. మీ సోది వినడానికి ఢిల్లీ నుంచి రాలేదు' అని కేంద్ర మంత్రి వ్యాఖ్యానింాచరు. ఓ దశలో ఆవేశంగా నిర్వాహకుల నుంచి మైక్ లాక్కుని ‘ఐ విల్ గో టు బ్యాక్'... అంటూ స్టేజి దిగిపోయారు.
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతి ఒక్క పెన్షన్దారుడికి రూ.వెయ్యి కనీస పెన్షన్ పథకాన్ని గుంటూరులో మంగళవారం అశోక్ గజపతిరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ సంఘటన చోటుచేసుకుంది. కేంద్రమంత్రి సభలోకి వచ్చీరావడంతోటే నేరుగా పెన్షన్ లబ్ధిదారుల వద్దకు వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వారిలో కొందరు ఆధార్ కార్డు ఉన్నా నివాస ధ్రువీకరణ పత్రాలు సరిగా లేవంటూ బ్యాంకులు ఖాతాలు తెరవనివ్వడం లేదని ఫిర్యాదు చేశారు.

దీంతో బ్యాంకు అధికారులను పిలిపించాలని కేంద్రమంత్రి ఆదేశించారు. ఆ తర్వాత సభ ప్రారంభమైంది. గుంటూరు పీఎఫ్ కార్యాలయ కమిషనర్ ఇందిరా తిరుమలరాజు ఉపన్యసిస్తున్నారు. ఈ సమయంలో ఎస్బీఐ డీజీఎం మెహర్ నారాయణ మిశ్రా, ఆంధ్రాబ్యాంకు అసిస్టెంట్ జీఎం రమణమూర్తి అక్కడికి వచ్చారు. సభలో ఇందిరా తిరుమలరాజు ఉపన్యాసం ముగిసిన వెంటనే సభలో ప్రకటన చేసేందుకు బ్యాంకు అధికారులు సిద్ధమయ్యారు. అయితే నిర్వాహకులు వారికి అవకాశం ఇవ్వకుండా మరొకరితో మాట్లాడించే ప్రయత్నం చేశారు. దీంతో నిర్వాహకులపై కేంద్రమంత్రి ఆగ్రహం వ్యక్తంచేసి కిందకి దిగిపోయారు.
అధికారులంతా ఆయనకు సర్దిచెప్పి వేదికపైకి వచ్చాక బ్యాంకు అధికారులిద్దరూ ప్రకటన చేశారు. ఇకపై బ్యాంకుల్లో ఖాతాలు తెరవడానికి ఆధార్లో ఉన్న అడ్రస్, వినియోగదారుడిచ్చే నివాస ధ్రువీకరణ పత్రం ఒకటి కాకపోయినా ఖాతాలు ప్రారంభిస్తామని తెలిపారు. దీనితో పెన్షన్దారుల్లో ఆనందం వ్యక్తమయింది.
అనంతరం మంత్రి మాట్లాడుతూ ముందు సమస్యలను పరిష్కరించి ఆ తర్వాత ఉపన్యాసాలు ఇచ్చుకోవాలంటూ హితోపదేశం చేశారు. రూ.వెయ్యి కనీస పెన్షన్ పథకంపై ఆయన మాట్లాడుతూ దేశంలో మొత్తం 49 లక్షల మంది పెన్షన్లు తీసుకుంటుంటే వారిలో 32 లక్షల మంది రూ.వెయ్యిలోపు, 12 లక్షల మంది రూ.500 లోపు తీసుకుంటున్నారని తెలిపారు. ఇకపై అందరికీ కనీస పెన్షన్ రూ.వెయ్యి అందిస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications