కేసులు, బెదిరింపులూ తనకేమీ కొత్తకాదు; చంద్రబాబు చెప్పినట్టు చెయ్యటానికి తానేమైనా పిఏనా? అశోక్ గజపతి
విజయనగరం రామతీర్థంలో బోడి కొండపై కోదండ రామాలయం నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో అశోక్ గజపతిరాజుకు అవమానం రగడ చిలికి చిలికి గాలివానగా మారింది. అది కాస్తా టిడిపి నేతలు, వైసిపి మంత్రుల మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది. బోడి కొండ పై జరిగిన పరిణామాలు చివరకు కేసులు పెట్టుకునే వరకు వెళ్లాయి.ఈవో ప్రసాద్ ఫిర్యాదు మేరకు నెల్లిమర్ల పోలీస్ స్టేషన్లో కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు పై కేసు నమోదైంది. అశోక్ గజపతిరాజు పై సెక్షన్ 473, 353 క్రింద కేసులు నమోదు చేశారు పోలీసులు. అయితే తనపై కేసులు పెట్టడంపై టిడిపి సీనియర్ నాయకుడు అశోక్ గజపతిరాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీ సర్కార్ హిందూ ధర్మాన్ని కాలరాస్తోంది
వైసీపీ ప్రభుత్వం హిందూ ధర్మాన్ని కాలరాస్తోందని ఆయన విమర్శించారు. బుధవారం నాడు నెల్లిమర్ల మండలం రామతీర్థం వద్ద సాంప్రదాయంగా జరగాల్సిన శంకుస్థాపన కార్యక్రమాన్ని వైసీపీ మంత్రులు వాళ్ల ఇష్టం వచ్చినట్లుగా చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాలయాల నిధులు ధార్మిక కార్యక్రమాలకు మాత్రమే ఖర్చు చేయాల్సి ఉన్నా ప్రభుత్వం అనుసరించడం లేదని అశోక్ గజపతిరాజు ఆరోపణలు గుప్పించారు. దేవాదాయ చట్టం రాష్ట్రంలో ఉందని అది లేకపోయి ఉంటే తనను చైర్మన్ పదవి నుంచి ఈ ప్రభుత్వం ఎప్పుడో తొలగించి ఉండేదని మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు వ్యాఖ్యానించారు.
దేవాదాయ శాఖా మంత్రి వాడుతున్న భాష తనకు రాదన్న అశోక్ గజపతి
దేవాదాయ శాఖ మంత్రి వాడుతున్న భాష తనకు రాదని ఆయన పేర్కొన్నారు. తనపై ప్రభుత్వం వ్యక్తిగతంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆయన మండిపడ్డారు. రామతీర్థం కొండపై ఆలయ పునర్నిర్మాణ ముహూర్తం తేదీ నిర్ణయించే ముందు తనకు తెలియపరచమని చెప్పినప్పటికీ తన మాట పట్టించుకోలేదన్నారు. ప్రభుత్వంలో దేవాదాయ అంశం భాగం కాదని సుప్రీంకోర్టు పదేపదే చెబుతున్న ప్రభుత్వం మూర్ఖంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఆనవాయితీలు సాంప్రదాయాలను మంట కలిపారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబును ఈ వివాదంలోకి లాగటంపై అశోక్ గజపతి అభ్యంతరం
రాజకీయ నాయకులు అమర్యాదగా వ్యవహరించారని అశోక్ గజపతిరాజు అసహనం వ్యక్తం చేశారు.బోడి కొండపై జరిగిన పరిణామాలలో టిడిపి అధినేత చంద్రబాబును లాగడంపై అశోక్ గజపతి రాజు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చంద్రబాబు చెప్పినట్లు చేయడానికి తాను ఏమైనా ఆయన పిఏనా అంటూ అశోక్ గజపతి రాజు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.మంత్రులను గౌరవిస్తాం కానీ ఊడిగం చేయలేమంటూ అశోక్ గజపతిరాజు పేర్కొన్నారు. ఈవోలతో కేసులు పెట్టించడం కొత్త అలవాటుగా మారిందని ఆయన ధ్వజమెత్తారు.
అరెస్ట్ లు, కేసులు, బెదిరింపులూ తనకేమీ కొత్త కాదు
ప్రభుత్వం చేస్తున్న తప్పులను ప్రశ్నించే తనపై కక్ష గట్టినట్టు ఆరోపించారు. ట్రస్ట్ ల ఆచార సంప్రదాయాలను ప్రతి ఒక్కరూ పాటించాలని, కానీ వైసిపి నేతలు ఆ విధంగా ప్రవర్తించటం లేదంటూ మండిపడ్డారు. శంకుస్థాపన కార్యక్రమంలో సాంప్రదాయాలు పాటించకపోవడం బాధ కలిగించిందని, వైసీపీ నేతల ప్రవర్తన విచిత్రంగా అనిపించింది అని అశోక్ గజపతిరాజు పేర్కొన్నారు. అరెస్టులు, కేసులు, బెదిరింపులు తనకు కొత్తేమీ కాదని న్యాయబద్ధంగా పోరాటం చేసి తీరుతానని ఆయన తెలిపారు.
గర్భగుడి దగ్గర శిలా ఫలకాలు ఎలా ఉంటాయో చెప్పాలి
దేవాదాయ శాఖలో ఆచార, సంప్రదాయాలు తప్ప ప్రోటోకాల్ అనే పదం ఉండదని, కానీ కొత్త కొత్త విధానాలతో వైసీపీ మంత్రులు రచ్చ చేస్తున్నారని మండిపడ్డారు. దేవాలయాలకు దేవుడే ఓనర్ అని పేర్కొన్నారు అశోక్ గజపతి రాజు. గర్భ గుడి దగ్గర శిలాఫలకాలు ఎలా ఉంటాయో చెప్పాలని ప్రశ్నించారు.
విధులకు ఆటంకం కలిగించామని కేసులు పెట్టడం కొత్త సాంప్రదాయమని, హిందూ మతాన్ని కాపాడటానికి తన శక్తివంచన లేకుండా కృషి చేస్తానని అశోక్ గజపతి రాజు వెల్లడించారు. తాను కేసులకు భయపడేది లేదని తేల్చి చెప్పారు. చాలాకాలంగా తనను టార్గెట్ చేస్తూనే ఉన్నారని, అయినా భయపడేది లేదని అశోక్ గజపతిరాజు స్పష్టం చేశారు.