విభజనపై సహనంలేని సోనియా: 'అసహనం'పై అశోక్, జగన్ భయం: కళా
అమరావతి/విజయనగరం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అంశాన్ని టేబుల్ ఆటంగా పెట్టి, కేబినెట్లో చర్చించే సహనం లేని ఏఐసీసీ అధ్యక్షురాలు, కాంగ్రెస్ పార్టీ అసహనం గురించి మాట్లాడటం విడ్డూరమని కేంద్రమంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు ఆదివారం మండిపడ్డారు.
దేశవ్యాప్తంగా మత అసహనం హెచ్చు మీరుతోందని ఇటీవల పలువురు సాహితీవేత్తలు అవార్డులు వెనక్కి ఇచ్చారు. మత అసహనంపై కాంగ్రెస్ సహా విపక్షాలు మండిపడుతున్నాయి. విపక్షాల మత అసహనంపై బిజెపి కూడా గట్టి కౌంటర్ ఇస్తోంది.
తాజాగా, అశోక్ గజపతి రాజు కూడా అసహనంపై కాంగ్రెస్ పార్టీ మాట్లాడటాన్ని ప్రశ్నించారు. ఏపీ విభజన అంశాన్ని టేబుల్ ఐటంగా పెట్టి చర్చించే సహనం లేని సోనియా అసహనం గురించి మాట్లాడటం విడ్డూరమన్నారు. కేంద్రం నుంచి తాము బయటకు వస్తే చేరిపోవాలని కొందరు భావిస్తున్నారని వైసిపిని ఉద్దేశించి అన్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుంటే టిడిపి కేంద్రం నుంచి వైదొలగాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అశోక్ గజపతి రాజు పైవిధంగా స్పందించారు.
జగన్ పైన కళా వెంకట్రావు ఆగ్రహం
రాజకీయ లబ్ధి కోసమే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అభివృద్ధికి అడ్డు పడుతోందని ఏపీ టీడీపీ అధ్యక్షులు కళా వెంకట్రావు అన్నారు. అమరావతినే మన బ్రాండ్ ఇమేజ్ అన్నారు. టిడిపి హయాంలో ఏపీ అభివృద్ధి చెందితే 2019లో మరోసారి కూడా ప్రజలు పక్కన పెడతారని జగన్ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు.