సీఎం చంద్రబాబుకు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ ఫోన్.. తుపాను పరిస్థితిపై ఆరా
ఏపీలో మొంథా తుపాను నేపథ్యంలో సీఎం చంద్రబాబుకు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ ఫోన్ చేశారు. తుపాను పరిస్థితులపై ఆరా తీశారు. రాష్ట్రంలో మొంథా తీవ్ర తుపాను పరిస్థితులపై సీఎం చంద్రబాబును అడిగి వివరాలు తెలుసుకున్నారు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్. మరోవైపు సీఎం చంద్రబాబు ఉదయం నుంచి తుపాను ప్రభావంపై వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. రెండుసార్లు ఆర్టీజీఎస్ నుంచి అలాగే రెండుసార్లు టెలీకాన్ఫరెన్స్ లు నిర్వహించారు. తుపాను పరిస్థితిపై క్షేత్ర స్థాయిలో అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. పలు సూచనలు ఇస్తున్నారు.
మరోవైపు మొంథా తుపాను నేపథ్యంలో ఏపీలో పాఠశాలలు, కళాశాలలకు ఈ నెల 31వరకు సెలవులు పొడిగించారు. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. ఇక ప్రకాశం జిల్లాలో కుండపోత వర్షం కురుస్తోంది. భారీ వర్షానికి సింగరాయకొండ పోలీస్ స్టేషన్ నీట మునిగింది. మరో ఘటనలో ఒంగోలు సమీపంలో కారు కొట్టుకుపోయింది. అయితే స్థానికుల సాయంతో డ్రైవర్ కారు నుంచి సురక్షితంగా బయటకు వచ్చాడు. ప్రకాశం, ఒంగోలు ప్రాంతాల్లో సిగ్నల్స్ లేకపోవటంతో మొబైల్ నెట్ వర్క్లు పనిచేయడం లేదు. అటు కైకలూరులోనూ కుండపోత వర్షం కురుస్తోంది.
ఇక విజయనగరం జిల్లా గుర్లలో కస్తూరిబా పాఠశాలలో విద్యార్థులకు విద్యుత్ షాక్ తగిలింది. దీంతో ఐదుగురు బాలికలు స్పృహ తప్పి పడిపోయారు. ప్రస్తుతం వారిని విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు అధికారులు. గుర్లలో భారీ ఈదురుగాలులకు విద్యుత్ వైర్లు తెగిపడడంతో .. గోడను పట్టుకున్న సుమారు 30 మంది బాలికలకు కరెంట్ షాక్ తగిలింది. అయితే వీరిలో ఐదుగురికి మాత్రమే సీరియస్ కావడంతో ఆస్పత్రికి తరలించారు.

ఇక అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 170 ఆర్టీసీ బస్సు సర్వీసులు రద్దు చేశారు అధికారులు. జిల్లా నుంచి హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, విశాఖకు వెళ్లే బస్సు సర్వీసులు రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.












Click it and Unblock the Notifications