గ్రామదర్శినిలో టిడిపి నేతలను నిలదీయండి...అది మ్యాచ్ ఫిక్సింగ్:రోజా
హైదరాబాద్:గ్రామదర్శిని పేరుతో గ్రామాల్లోకి వస్తున్న తెలుగుదేశం పార్టీ నేతలను హామీల అమలు విషయమై నిలదీయాలని వైసిపి ఎంఎల్ఏ రోజా ప్రజలకు పిలుపునిచ్చారు.
ఆమె ఆదివారం హైదరాబాద్లోని వైసిపి కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 600లకుపైగా హామీలను ఇచ్చిందని, వాటిలో వేటిని అమలు చేశారో ప్రజలకు గ్రామదర్శినిలో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. టిడిపి నాయకులకు దమ్ముంటే వెబ్సైట్ నుండి తొలగించిన మ్యానిఫెస్టోను తిరిగి వెబ్సైట్లో పెట్టి, గ్రామదర్శినిలో దాని ఆధారంగా చర్చల జరపాలని ఆమె సవాల్ చేశారు.
టిడిపి పాలనలో...గొప్ప ఏముంది?
టిడిపి ప్రభుత్వం 1500 రోజుల పాలనలో ప్రచార ఆర్భాటం , అవినీతి అక్రమాలు తప్ప గొప్పేమి ఉందని ఆమె ప్రశ్నించారు. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. చంద్రబాబు పాలనలో ఆయన కుమారుడికి, పచ్చమీడియాకు తప్ప మరెవరికైనా ప్రయోజనం కలిగిందా అని ప్రశ్నించారు. ప్రమాణస్వీకారం సందర్భంగా చేసిన ఐదు సంతకాలు అమలు చేశామని చెప్పుకుంటున్నారని, అవి ఎక్కడ అమలయ్యాయో చూపించాలని అన్నారు. మూడేళ్లలో సంవత్సరానికి రూ.30 వేల కోట్ల చొప్పున తెచ్చిన రుణాలతో ఏం చేశారో ప్రజలకు వివరించాలన్నారు. పోలవరంలో జరుగుతున్న అవినీతికి కేంద్ర మంత్రి గడ్కారీ అడిగిన ప్రశ్నలే నిదర్శనమని అన్నారు.
కేంద్ర మంత్రి మాటలు...మ్యాచ్ ఫిక్సింగ్
ప్రజల దృష్టి మరల్చడానికే బాబు, లోకేశ్లు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని కేంద్ర మంత్రి రాందాస్తో మాట్లాడించారని మండిపడ్డారు. ‘అసలు రాందాస్ అథవాలే ఎవరు? ఆయన మమ్మల్ని బీజేపీలోకి ఆహ్వానించడమేంటి? దాన్ని పచ్చ చానల్స్ హంగామా చేయడమేంటి? చూస్తుంటే...ఇదంతా సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ పథకం ప్రకారం ఆడిన డ్రామాలా అన్పించడం లేదా?' అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రశ్నించారు. ‘తండ్రీకొడుకులు కేంద్ర మంత్రి అథవాలేతో మ్యాచ్ఫిక్సింగ్ చేసుకుని, ఆయనతో ప్రెస్మీట్ పెట్టించి ప్రకటన ఇప్పించారు... ఆయన అలా ప్రకటన చేయడం ఆలస్యం నారా లోకేశ్ ఇది కుట్ర అంటూ ట్వీట్ చేసేశారు.. ఆ మరుక్షణమే సీఎం చంద్రబాబు విలేకరుల సమావేశం పెట్టారని ఆరోపించారు.
ఇది మీ కుట్ర కాదా?...కెమేరా ముందుకు రావాలి
"నిజంగా ఇదంతా మీ కుట్ర కాదా?...ప్రతిపక్ష నేత వైఎస్ జగన్పై బురద జల్లడానికి చంద్రబాబు చేస్తున్న ప్రయత్నమే ఇది. బీజేపీ కాదుకదా.. ఏ పార్టీతోనూ పొత్తు లేకుండానే వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా వెళ్తామని వైఎస్ జగన్ ప్రతి సభలోనూ పదేపదే చెబుతున్నారు" అని రోజా గుర్తు చేశారు. అధికారం కోసం వైఎస్ జగన్ ఏ పార్టీతోనూ ఇప్పటివరకూ జత కట్టలేదని, పొత్తు పెట్టుకుని అధికారం చేజిక్కించుకోవాలని ఆరాటపడలేదని ఆమె తెలిపారు. చంద్రబాబు తన 1500 రోజుల దరిద్రపు పాలనపై ప్రజలు చర్చించుకోకుండా పక్కదారి పట్టించేందుకు ఈ డ్రామాకు తెరతీశారని రోజా దుయ్యబట్టారు. జగన్ బీజేపీలోకొస్తే బాగుంటుందని అథవాలే చేసిన ప్రకటన కూడా ఇందులో భాగమేనన్నారు. వెంటనే నిప్పు ప్రెస్మీట్ పెట్టేశాడని, నిమిషాల్లోనే పప్పు ఇది కుట్ర అంటూ ట్వీట్లు చేశాడని ఆమె మండిపడ్డారు. లోకేశ్కు ధైర్యం ఉంటే తమ పార్టీ ఏం కుట్ర చేసిందో కెమెరాల ముందుకొచ్చి చెప్పాలని ఆమె సవాలు విసిరారు.
మీకే లబ్ది....అర్హత ఎక్కడిది?...
మంచి చేసి ప్రజల మెప్పు పొందాలన్న ఆలోచన చంద్రబాబుకు ఎప్పుడూ లేదని, ఎదుటివారిపై బురదజల్లి, తన పచ్చమీడియాలో ప్రచారం చేసుకుని లబ్ధి పొందడమే ఆయనకు తెలిసిన విద్యని రోజా ధ్వజమెత్తారు. 1999, 2004, 2014 సంవత్సరాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీతో కలిసే చంద్రబాబు ఎన్నికలకెళ్లారని గుర్తుచేశారు. ఒంటరిగా ఏనాడూ ఎన్నికల్లో పోటీ చేసిన చరిత్ర చంద్రబాబుకు లేదని...ఇలాంటి వ్యక్తికి జగన్ గురించి మాట్లాడే అర్హత ఎక్కడిదని రోజా ప్రశ్నించారు. చంద్రబాబు పాలనలో ఆయనకు, ఆయన కుమారుడికి, ఆయన మీడియా సంస్థలకు తప్ప ఇంకెవరికీ ప్రయోజనం కలగలేదని రోజా అన్నారు. ప్రజల సంపదను దోచుకోవడమే కాకుండా, టీటీడీ ఆస్తులూ కాజేసేందుకు పథకాలు వేశారని ఆమె మండిపడ్డారు.
కరవుకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు
కరవుకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు అని, ఆయన ఎప్పుడొచ్చినా రైతుల జీవితాలు కరవుతో అల్లాడిపోతున్నాయని విమర్శించారు. గతంలో చంద్రబాబు 3,178 రోజులు పరిపాలించాడని, ఆ పాలన దరిద్రంగా ఉండబట్టే ప్రజలు పదేళ్లు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారన్నారు. ఎస్సీ ఎస్టీ మహిళలపై అత్యాచారాలు, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కడంలో రాష్ట్రాన్ని నెంబర్వన్గా చేయడమే చంద్రబాబు సాధించిన ఘనతని నిప్పులు చెరిగారు. చంద్రబాబుకు ధైర్యం ఉంటే పోలవరం అవినీతి, టీటీడీ అక్రమాలు, రాజధానిలో రైతుల భూములు దోచుకోవడం, ఓటుకు కోట్లు కేసుపై సీబీఐ విచారణ వేయించుకోవాలని సవాల్ చేశారు. గోదావరి పుష్కరాల్లో చనిపోయినవారికి ఇప్పటికీ న్యాయం చేయని పాలన బాబుదన్నారు. స్కూలుకు సెలవైనా వనం-మనం పేరుతో పిల్లలను తీసుకెళ్లి పొట్టనబెట్టుకున్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక చంద్రబాబు అరాచకాలపై విచారణ జరుపుతామని, నష్టపోయినవారికి న్యాయం చేస్తామని రోజా చెప్పారు.