కిరణ్పై ఆగ్రహం, సభలో గందరగోళం: టిVsజగన్ పార్టీ
హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లును తిప్పి పంపించాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చిన నోటీసు పైన తెలంగాణ ప్రాంత నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం ఉదయం శాసన సభ ప్రారంభం అయిన కాసేపటికే ఈ అంశంపై గందరగోళం చెలరేగటంతో వాయిదా పడింది. ఉదయం సభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ నాదెండ్ల మనోహర్ తిరస్కరించారు.
ముఖ్యమంత్రి నోటీసును తిరస్కరించాలని తెలంగాణ ప్రాంత నేతలు స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు గీతా రెడ్డి, సుదర్శన్, బస్వరాజు సారయ్య, ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణ రెడ్డి, శ్రీధర్ బాబు తదితరులు వారికి వంత పాడారు. సభ జై తెలంగాణ నినాదాలతో మార్మోగింది. మరోవైపు వైయస్సార్ కాంగ్రెసు, సీమాంధ్ర టిడిపి నేతలు జై సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. ఓటింగ్ జరపాలని జగన్ పార్టీ పోడియంను చుట్టుముట్టింది. గందరగోళం ఏర్పడటంతో సభాపతి అరగంట పాటు వాయిదా వేశారు.

సభాపతికి సురేష్ రెడ్డి లేఖ
సభాపతి నాదెండ్ల మనోహర్కు మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి లేఖ రాశారు. రాష్ట్రపతి పంపించింది డ్రాఫ్ట్ బిల్లు కాదని అసలు బిల్లేనని అందులో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఏకపక్షంగా నోటీసు ఇచ్చారని, దానిని తిరస్కరించాలని కోరారు. నోటీసు పైన తుది నిర్ణయం స్పీకర్దేనని చెప్పారు. మరోవైపు కిరణ్ ఇచ్చిన లేఖను తిరస్కరించాలని తెలంగాణ ప్రాంత మంత్రులు మరోసారి సభాపతికి లేఖ రాశారు.
శాసన సభ వాయిదా పడిన అనంతరం తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. తెలంగాణ టిడిపి నేతలు ముందు ఆ పార్టీ నుండి బయటకు రావాలని డిమాండ్ చేశారు. కిరణ్ తానిచ్చిన నోటీసును వెనక్కి తీసుకొని క్షమాపణ చెబితేనే తాము చర్చకు సహకరిస్తామన్నారు. తెలంగాణ ప్రాంత మంత్రులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు, కిరణ్లు తెలంగాణను అడ్డుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. ఎన్ని రోజులైనా సభను జరగనివ్వమని చెప్పారు. గండ్ర వెంకటరమణ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట రెడ్డిలు మీడియా పాయింటు వద్ద మాట్లాడారు.












Click it and Unblock the Notifications