రికార్డయింది: శైలజ, సీమాంధ్రలో స్వీట్లు పంచుకున్నారు
రాష్ట్ర ప్రజల మనోభావాలకు అద్దం పట్టేలా మండలిలో, శాసన సభలో తీర్మానం జరిగిందన్నారు. ముఖ్యమంత్రిగా, సభా నాయకుడిగా కిరణ్ కుమార్ రెడ్డి నోటీసులు ఇచ్చారని చెప్పారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగానే బిల్లు తిరస్కరించామని చెప్పారు. ఈ నిర్ణయాన్ని అందరు గుర్తించాలన్నారు. మూజువాణి ఓటు అంటే ఏకగ్రీవమేనని చెప్పారు. దీనిని ఏకగ్రీవ తీర్మానంగా గుర్తిస్తారని చెప్పారు. తిరస్కరణ బిల్లును పార్లమెంటుకు పంపించవద్దని సిఎం తీర్మానంలో ఉందన్నారు.
అప్రజాస్వామికం: ఉండవల్లి
బిల్లు రాజ్యాంగ విరుద్ధమని, అప్రజాస్వామికమని కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి పార్లమెంటు సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఈ బిల్లుకు తాము వ్యతిరేకమని మరోసారి స్పష్టం చేశారు. రాష్ట్ర శాసనసభ విభజన బిల్లును తిరస్కరించడంతో ఉండవల్లి మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం విభజన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడితే మరోసారి అవిశ్వాస తీర్మాన నోటీసును ఇస్తామని ప్రకటించారు.
బాబు, కిరణ్లే కారణం: విజయమ్మ
విభజనకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడులే కారణమని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షులు వైయస్ విజయమ్మ ఆరోపించారు. బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి ముఖ్యమంత్రికి 17 గంటలు పట్టిందని, బిల్లు వచ్చిన రోజున ఆయన కనీసం దాన్ని చూడలేదని, ఆరోగ్యం బాగాలేదని తప్పించుకున్నారని ఆరోపించారు. రోడ్ మ్యాప్ ఇచ్చి తమ రాజీనామాలను ముఖ్యమంత్రి ఆపారని అన్నారు. బిల్లు వచ్చినప్పుడే అందులోని లోపాలను కిరణ్ ఎందుకు ఎత్తి చూపలేదన్నారు.
కాగా, తెలంగాణ ముసాయిదా బిల్లు ఇరు సభలు తిరస్కరించడంతో సీమాంధ్రలో సమైక్యవాదులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ, ఏలూరు, గుంటూరు తదితర ప్రాంతాల్లో సమైక్యవాదులు మిఠాయిలు పంచుకొని ఆనందం వ్యక్తం చేశారు.