అసెంబ్లీ సీట్ల పెంపుపై ఢిల్లీ బిగ్ అప్డేట్ - కీలక మలుపు, 2029 గేమ్ ఛేంజర్..!!
ఏపీ రాజకీయాల్లో కీలక మలుపు. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాల వేళ మరో బిగ్ అప్డేట్ ఇప్పుడు పార్టీల్లో ఆసక్తి కరంగా మారుతోంది. 2029 నుంచి అసెంబ్లీ సీట్లు పెరుగుతాయనే అంచనాలతో పార్టీలు ఉన్నాయి. నియోజకవర్గాల పునర్విభజన పైన అంచనాలు మొదల య్యాయి. ఈ సమయంలోనే ఢిల్లీ నుంచి కీలక సమాచారం అందింది. దీంతో, వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న పార్టీల్లో టెన్షన్ మొదలైంది. ఈ నిర్ణయం 2029 ఎన్నికల్లో గేమ్ ఛేంజర్ గా మారనుంది.
కీలక పరిణామాలు
ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ స్థానాలను పెంచాల్సి ఉంది. ఇదే అంశం పైన ఇప్పటికే సుప్రీంలో దాఖలైన పిటీషన్ పైన న్యాయస్థానం స్పష్టత ఇచ్చింది. కేంద్రం చేపడుతున్న జనగణన తరువాతనే నియోజకవర్గాల పునర్విభజన సాధ్యం అవుతుందని తేల్చి చెప్పింది. కాగా, కేంద్రం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాల పైన ప్రభావం పడుతోంది. కేంద్రం జనగణన పై షెడ్యూల్ ప్రకటించింది. 2026 అక్టోబరు నుంచి జన గణన చేపట్టాలని కేంద్రం నోటిఫికేషన్ ఇచ్చింది. దీని ప్రకారం తొలి దశలో జమ్మూ కశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో జనాభా లెక్కల సేకరణ జరగనుంది. రెండో విడత... 2027 మార్చి ఒకటి నుంచి దేశమంతా చేపడతారు.

సీట్లు పెరిగేదెప్పుడు
దీంతో, 2029 ఎన్నికల నాటికి నియోజక వర్గాల పునర్విభజన పూర్తవుతుందని రాజకీయ పార్టీలు అంచనా వేస్తున్నాయి. అయితే, అసలు విషయం ఢిల్లీ ముఖ్యుల నుంచి రాష్ట్రానికి అందింది. ఈ మేరకు జనాభా లెక్కలు సేకరించి, వాటిని క్రోడీకరించి, పూర్తిస్థాయిలో గణాంకాలు ఖరారు చేసేం దుకు కనీసం మూడేళ్లు పడుతుందని స్పష్టం చేసారు. ఈసారి డిజిటల్ ఫార్మాట్లో, మొబైల్ అప్లికేషన్ల ద్వారా జనగణన చేస్తున్నందున... కొంత తక్కువగా రెండేళ్లలోనే లెక్కలు తేలవచ్చు. అంటే... 2029 లేదా 2030లో కొత్త జనాభా గణన వివరాలు ప్రచురితమైన తర్వాత వాటి ఆధారంగా తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజవకవర్గాల పునర్విభజన జరగనుంది. దీని పైన కమిషన్ ఏర్పాటు అవుతుంది. సమగ్రంగా అధ్యయనంతో పాటుగా ఒక ముసాయిదా నోటిఫికేషన్ ఇవ్వాలి. ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు స్వీకరించాలి. దాని ఆధారంగా ఫైనల్ నోటిషికేషన్ ఇవ్వాలి. అప్పటికిగానీ కొత్త నియోజకవర్గాలు అందుబాటులోకి రావు.
కలిసొచ్చేదెవరికి
దీంతో, వచ్చే 2029 ఎన్నికల్లో కొత్త నియోజకవర్గాలను ప్రకటించే అవకాశమే లేదు. 2034లో జరిగే ఎనికల్లోనే కొత్త నియోజకవర్గాలు అందుబాటులోకి వస్తాయని ఎన్నికల కమిషన్ వర్గాలు సైతం స్పష్టం చేస్తున్నాయి. ఈ నిర్ణయం ప్రధానంగా కూటమి పార్టీల పైన ప్రభావం చూపే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికల్లోనూ కలిసే పోటీ చేస్తామని కూటమి నేతలు చెబుతున్నారు. అయితే, వచ్చే ఎన్నికల్లో మూడు పార్టీల కూటమి కొనసాగితే బీజేపీ - జనసేన సీట్ల పెంపు పైన పట్టు బట్టే అవకాశం కనిపిస్తోంది. ఇందు కోసం టీడీపీ నేతలు సీట్లు త్యాగానికి సిద్దపడాలి. ఇది అసంతృప్తికి దారి తీస్తే వైసీపీ తమకు అవకాశంగా మలచుకునే ప్రయత్నం చేస్తుంది. వైసీపీ ముందస్తుగానే నియోజకవర్గాల సమన్వయకర్తలను ఖరారు చేస్తోంది. దీంతో.. 2029 ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలకే ఎన్నికలు జరగటం ఖాయంగా కనిపిస్తున్న వేళ.. ఈ తాజా పరిణామాలు వచ్చే ఎన్నికల్లో గెలుపు ఓటములను డిసైడ్ చేసే గేమ్ ఛేంజర్ గా మారనుంది.












Click it and Unblock the Notifications