వాహనానికి మారిన ముద్ర...ఇకపై జివికె స్థానంలో జివిజి
పశ్చిమ గోదావరి జిల్లా: ఆగస్టు 15, 2005 సంవత్సరం...108 వాహన రంగప్రవేశం...అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ ప్రజారోగ్య వ్యవస్థలో చారిత్రాత్మక మార్పుకు నాంది పలికిన ఘట్టం...ఆ తర్వాత ఎన్నో ఏళ్ల పాటు తక్షణ వైద్య సహాయం అవసరమైన వారిని ఆదుకుంటూ ముందుకు సాగిపోయింది. ఆ తర్వాత కాలక్రమంలో ఆటుపోట్లు ఎదురయ్యాయి...గత వైభవం క్షీణించింది...అసలు మనుగడే ప్రశ్నార్థకంగా మారింది.మరి ఇప్పుడు ఆ 108 పరిస్థితి ఏంటి?
సవాలక్ష కారణాలతో కునారిల్లిన 108 వాహనాలు, వాటి నిర్వహణా సిబ్బంది మళ్లీ పునర్వైభవాన్ని చవిచూస్తారా? ఆ జీవితాల్లో మళ్లీ పాత వెలుగులు విరజిమ్ముతాయా...ఇప్పుడు ఈ ప్రశ్న ఉదయించడానికి కారణం 108 వాహనాల మేనేజ్ మెంట్ మారింది. సుమారు 10 ఏళ్ల పాటు వీటిని నడిపించిన జీవీకే-ఈఎంఆర్ఐ స్థానంలో ఇప్పుడు జివిజి అనే కొత్త సంస్థ నిర్వహణా బాధ్యతలు చేపట్టింది. మరి ఈ జివిజి సంస్థ 108 వాహనాలను మళ్లీ మునుపటిలా ఆపధ్బాంధవ పాత్ర ఎంతవరకు పోషిస్తుందో వేచిచూడాలి.
జీవీకే-ఈఎంఆర్ఐ ఔట్...
గత సంస్థ జీవీకే-ఈఎంఆర్ఐ గతంలో లోగా 108 వాహనాలను నడపలేకపోవడం, దీంతో ప్రభుత్వానికి, ఆ సంస్థకు 108 వాహనాల నిర్వహణ విషయంలో బేధాభిప్రాయాలు రావడంతో ఆ సంస్థను తొలగించి కొత్త సంస్థ కు 108 నిర్వహణ అప్పగించాలని ఎపి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ విషయంపై జీవీకే-ఈఎంఆర్ఐ కోర్టుకు వెళ్లడంతో ప్రభుత్వం నిర్ణయం ఆచరణలోకి రాలేదు. అయితే చివరకు కోర్టు తీర్పు అనుసరించి జివిజి సంస్థకు ఈ టెండర్ దక్కింది. దీంతో జీవీకే-ఈఎంఆర్ఐ సంస్థ పక్కకు తప్పుకొని జివిజి సంస్థ తెర మీదకు వచ్చింది.
ఎక్కడదీ జివిజి సంస్థ...
జివిజి సంస్థ గుంటూరు జిల్లా మంగళగిరికిలో ఉంది. అయితే ఈ సంస్థకు గతంలో ఈ తరహా వాహనాలు నడిపిన అనుభవం లేదు. అందువల్ల 108 వాహనాల్లో పరికరాలు ఏమున్నాయి, అసలు ఈ వాహనాలు ఎలా నడుస్తున్నాయి అనే విషయాలపై పూర్తి అవగాహన వచ్చేందుకు ఆ సంస్థకు ఇంకా సమయం పడుతుంది. అందుకే అన్ని జిల్లాలో ఒకేసారి కాకుండా ఒక్కో జిల్లాలో 108 వాహనాలను నడిపేందుకు రోజుకో జిల్లా చొప్పున జీవీజీ సంస్థ బాధ్యతలను తీసుకుంటోంది. ఆ క్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా 108 బాధ్యతలు చేపట్టింది.
ముద్ర మారింది..
గతంలో జీవీకే సంస్థ ఆధ్వర్యంలో నడిచిన 108 వాహనాలు ఇక నుంచి జీవీజీ సంస్థ ఆధ్వర్యంలో నడవనున్నాయి. దీంతో పాత ముద్ర స్థానంలో కొత్త ముద్ర అనివార్యమైంది. సుమారు పదేళ్ళ పాటు జీవీకే - ఈఎంఆర్ఐ అనే గుర్తుతో కనిపించిన 108 వాహనాలు ఇక నుంచి జీవీజీ అనే ముద్రతో సిద్ధమయ్యాయి.
పశ్చిమగోదావరి జిల్లాలో...
పశ్చిమ గోదావరి జిల్లాలో సుమారు 36 వాహనాలు రోడ్లపై తిరగనున్నాయి. గతంలో 108 వాహనాలు తిరిగే సమయంలో రోగులకు అనేక ఇబ్బందులు ఎదురయ్యేవి. వాహనంలో ఆక్సిజన్ లేకపోవడం లేదా టైర్లు పంక్చరవడం, డీజిల్ లేకపోవడం, సిబ్బంది విధులకు హాజరు కాకపోవడం వంటి ఇబ్బందులతో వాహనాలు సరిగా నడిచేవి కాదు. 108 వచ్చిన మొదట్లో పరిస్థితికి పూర్తి భిన్నంగా తయారైంది ఇటీవలి కాలంలో పరిస్థితి. అయితే ఇప్పుడు కొత్త సంస్థ రంగప్రవేశంతో 108 వాహనాల నిర్వహణలో నూతనోత్తేజం కలుగుతుందని ,మళ్లీ పునర్ వైభవం వస్తుందని అటు సిబ్బంది, ఇటు సామాన్య ప్రజానీకం ఆశపడుతున్నారు.