టిడిపి-బిజెపి మధ్య జగన్ చిచ్చు: 'క్రిమినల్ను కూర్చోబెట్టుకుంటారా, ఆలోచించండి'
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం - భారతీయ జనతా పార్టీ నేతల మధ్య చిచ్చు పెట్టారు!
గుంటూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం - భారతీయ జనతా పార్టీ నేతల మధ్య చిచ్చు పెట్టారు! ఆయన ప్రధాని నరేంద్ర మోడీని కలవడం మిత్రపక్షాల మధ్య వాగ్యుద్ధానికి దారి తీసింది.
తాజాగా, మంత్రి అచ్చెన్నాయుడు మంత్రి మాణిక్యాల రావు వ్యాఖ్యలపై స్పందించారు. బీజేపీపై టిడిపి నేతలు కుట్ర చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించడం బాధ కలిగించిందని అచ్చన్న అన్నారు. వచ్చే అయిదేళ్లు కూడా తాము బీజేపీతో కలిసి పని చేస్తామని చెప్పారు.
ప్రధానిని ఎవరైనా కలువొచ్చు కానీ..
రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని ఎవరైనా కలువవచ్చునని అచ్చెన్నాయుడు అన్నారు. అయితే ప్రధాని మోడీ తన పక్కన క్రిమినల్స్ను పెట్టుకోవడం సరికాదన్నారు.దీనిపై బీజేపీ నేతలు ఆలోచన చేయాలన్నారు. ఓ నేరగాడిని పక్కన కూర్చోబెట్టుకోవడం తప్పుడు సంకేతాలు ఇస్తుందన్నారు.
జగన్కు ఎలా ఇస్తారు
14 నెలల పాటు జైలులో ఉన్న వ్యక్తికి ప్రధాని నరేంద్ర మోడీ అపాయింటుమెంట్ ఇవ్వడం ఏమాత్రం సరికాదని అచ్చెన్నాయుడు అభిప్రాయపడ్డారు. జగన్కు అపాయింటుమెంట్ ఇవ్వడాన్నే తాము తప్పుబడుతున్నామన్నారు.
జగన్ కలవడంపై దుమారం
కాగా, ఇటీవల జగన్ ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన విషయం తెలిసిందే. దీంతో జగన్పై టిడిపి నేతలు భగ్గుమన్నారు. కేసుల మాఫీ కోసమే ప్రధానిని ఆయన కలిశారని ఆరోపించారు.
బీజేపీ ఆగ్రహం
అదే సమయంలో ప్రధాని నరేంద్ర మోడీని కూడా తప్పుబట్టారు. ఓ 420కి అపాయింటుమెంట్ ఎలా ఇస్తారని టిడిపి నేతలు వరుసగా ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మోడీ అపాయింటుమెంట్ ఇవ్వడాన్ని తప్పుబడితే ఎలా అంటున్నారు.