జగన్ 36 కేసుల కోసం 32 మంది ప్రాణ త్యాగం చేసిన విశాఖ ఉక్కును పణంగా పెట్టారు : అచ్చెన్న ఫైర్
విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించాలని కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆందోళన ఉధృతం చేయడంలో భాగంగా రేపు రాష్ట్రవ్యాప్త బంద్ కు పిలుపునిచ్చింది విశాఖ పరిరక్షణ సమితి. అయితే ఈ బంద్ కు అన్ని పార్టీల నుండి మద్దతు లభిస్తుంది. అటు ఏపీ ప్రభుత్వం సైతం బంద్ కు మద్దతు ఇస్తూ ప్రకటన చేసింది.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ .. మార్చి 5న ఏపీ బంద్ కు పిలుపు ,తెలంగాణాలోనూ ఉద్యమం
రేపు ఏపీ బంద్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించిన టీడీపీ
విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయడాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న టిడిపి , రేపు రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న బంద్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈమేరకు టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా బంద్ ను టిడిపి శ్రేణులు విజయవంతం చేయాలని కోరిన ఆయన విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకోవడం కోసం అందరు సమైక్యంగా పోరాటం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇదే సమయంలో వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు అచ్చెన్నాయుడు .
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరిస్తుంటే తాడేపల్లి ప్యాలెస్ లో జగన్ పబ్జీ ఆడుతున్నాడు : అచ్చెన్న
స్టీల్ ప్లాంట్ లేకపోతే విశాఖ ఉనికికే ప్రమాదమని, స్టీల్ ప్లాంట్ భూములలో వాటాలు కొట్టేయడం కోసమే వైసిపి మొసలి కన్నీరు కారుస్తోంది అని విమర్శించారు. అంతేకాదు విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తుంటే ఏమీ పట్టనట్టు సీఎం జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలస్ లో కూర్చొని పబ్జి గేమ్ ఆడుకుంటున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం నాడు 32 మంది ప్రాణత్యాగం చేశారని గుర్తు చేసిన అచ్చెన్నాయుడు నేడు 36 కేసుల మాఫీ కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉక్కు కర్మాగారాన్ని పణంగా పెట్టారని ద్వజమెత్తారు.
విశాఖ ఉక్కు కోసం కలిసి పోరాటం చేద్దామంటే వైసీపీ ఉలుకూ పలుకూ లేదు
ప్రజా ప్రయోజనాల విషయంలో తెలుగుదేశం పార్టీ రాజీలేని పోరాటం చేస్తుందని పేర్కొన్నారు ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు . విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకోవడం కోసం కలిసి పోరాడదామని అధికార వైసీపీ ని పిలిస్తే ఉలుకూ పలుకూ లేదని అసహనం వ్యక్తం చేశారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ వల్ల 40 వేల మందికి ప్రత్యక్షంగా లక్ష మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని, అలాంటి స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కేంద్రానికి అచ్చెన్నాయుడు విజ్ఞప్తి చేశారు .
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరిస్తున్నా పట్టించుకోని వైసీపీకి బుద్ధి చెప్పండి
గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి ఒక్కరూ విశాఖ ఉక్కు ఉద్యమం లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని కేంద్రానికి అర్ధం అయ్యేలా నినదించాలని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు . విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న వైసీపీని విశాఖ కార్పొరేషన్ ఎన్నికలలో ఓడించి తగిన బుద్ధి చెప్పాలని అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు.