జైలు నుండి విడుదలైన అచ్చెన్నాయుడు .. నిమ్మాడ పంచాయతీ పోలింగ్ వేళ కన్నీరు పెట్టుకున్న అచ్చెన్న.. ఆపై సవాల్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల పోరులో భాగంగా మొదటి విడత పంచాయతీ ఎన్నికలలో పోలింగ్ కొనసాగుతోంది. ఇక ఇదే రోజు అచ్చెన్నాయుడు స్వగ్రామమైన నిమ్మాడలో కూడా ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. అక్కడ అచ్చెన్నాయుడు సతీమణి సర్పంచి అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచారు. భారీ బందోబస్తు మధ్య నిమ్మాడలో ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఇదే సమయంలో ఒకపక్క పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరుగుతుంటే బెయిల్ పై విడుదలైన అచ్చెన్నాయుడు భావోద్వేగానికి గురయ్యారు.
అంపోలు జైలు నుంచి బయటకు వచ్చిన అచ్చెన్నాయుడు భావోద్వేగం
పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగిన కింజారపు అప్పన్నను బెదిరించారన్న ఆరోపణలతో అరెస్టయిన ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు జైలు నుండి విడుదలయ్యాడు. కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో శ్రీకాకుళం జిల్లా అంపోలు జైలు నుంచి బయటకు వచ్చిన ఆయన భావోద్వేగానికి గురయ్యారు. మీడియాతో మాట్లాడుతూ కన్నీరు పెట్టుకున్నారు. తనకు సంబంధం లేని కేసులో ఇరికించారని చెప్పిన అచ్చెన్నాయుడు శ్రీకాకుళం జిల్లా ఎస్పీ ఉద్యోగానికి అనర్హుడని మండిపడ్డారు.
చేయని తప్పుకు, సంబంధంలేని ఇష్యూకు తనను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారన్న అచ్చెన్న
వ్యక్తుల కంటే వ్యవస్థకు ప్రాధాన్యతనివ్వాలని చెప్పిన అచ్చెన్నాయుడు చేయని తప్పుకు, సంబంధంలేని ఇష్యూకు తనను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారని పేర్కొన్నారు. తనను అరెస్ట్ చేసినందుకు భయపడడం లేదని, బాధ పడటం లేదని పేర్కొన్న ఆయన, వైసీపీ సర్కార్ కావాలని తప్పుడు కేసుల్లో ఇరికించింది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 1978 నుంచి రాజకీయాల్లో ఉన్న కుటుంబం తమదని పేర్కొన్న అచ్చెన్నాయుడు, నిమ్మాడ పంచాయతీ ఎప్పుడూ ఏకగ్రీవంగానే కొనసాగుతోందని చెప్పారు.
తానేమీ బెదిరింపులకు పాల్పడలేదన్న అచ్చెన్నాయుడు
ప్రభుత్వం ఈసారి తమ పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న కారణంగా, ఎన్నికలకు వెళ్లాలని భావించామని, ఈసారి ఏకగ్రీవం కావాలని కూడా కోరుకోలేదని ఆయన పేర్కొన్నారు. అప్పన్న సోదరుడు అప్పన్నను పోటీ నుంచి విరమింప చేయాలని చేసిన విజ్ఞప్తి మేరకు అప్పన్నకు ఫోన్ చేశానని, ఫోన్ రికార్డు అవుతున్న విషయం తనకు తెలియదని, అయినా తానేమీ బెదిరింపులకు పాల్పడలేదని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. అయినా తన ఫోన్ కాల్ లో బెదిరించినట్లు ఎవరైనా నిరూపించాలని సవాల్ విసురుతున్నా అని పేర్కొన్నారు.
ఫోన్ లో బెదిరించానని నిరూపిస్తే రాజకీయాలనుండి తప్పుకుంటా అంటూ సవాల్
తాను బెదిరించానని ఎవరైనా నిరూపిస్తే ఇప్పటికిప్పుడు రాజకీయాల నుంచి తప్పుకుంటానని భావోద్వేగానికి గురయ్యారు. తనకు జరిగిన అన్యాయానికి పోరాటం చేస్తానని పేర్కొన్న ఆయన, సింహాన్ని బంధించి ఎన్నికలు జరిపించాలనుకుంటున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకగ్రీవాల కోసం ప్రభుత్వం ఎంత ఒత్తిడి తీసుకు వచ్చినా తమ కార్యకర్తలు ధైర్యంగా నిలబడ్డారని అచ్చెన్న పేర్కొన్నారు . ఇదే సమయంలో విశాఖ ఉక్కు కర్మాగారానికి ప్రైవేటీకరణ చేయాలన్న కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని, విశాఖ ఉక్కు కర్మాగారం కోసం పార్టీలకు అతీతంగా పోరాటం సాగిస్తామని అచ్చెన్నాయుడు తెలిపారు.