మంత్రి పెద్దిరెడ్డి తప్పు చేయకపోతే ఎందుకింత భయం? ప్రశ్నించిన అచ్చెన్నాయుడు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలపై, ప్రతిపక్ష పార్టీలు నేతలను, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును వైసిపి ప్రభుత్వం అడ్డుకుంటున్న తీరుపై టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పోలీస్ చట్టం 1861 లోని సెక్షన్ 30 కేవలం టిడిపి అధినేత చంద్రబాబును అడ్డుకోవడానికి తప్ప, కోడిపందాలు, జూదాలను అడ్డుకోవడానికి పనికిరాదా అంటూ అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.

ప్రతిపక్ష పార్టీల పర్యటనలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న వైసీపీ సర్కార్
వైసిపి ప్రభుత్వం దిక్కుమాలిన చట్టాలను తీసుకువచ్చి ప్రతిపక్ష నేతల పర్యటనలను అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని, ఆయా చట్టాల కింద నోటీసులు ఇస్తుందని అచ్చెన్నాయుడు అసహనం వ్యక్తం చేశారు. ఇక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించిన అచ్చన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తప్పుడు కేసులు పెట్టించి తెలుగుదేశం పార్టీ వారిని పండుగనాడు జైల్లో పెట్టించారని, ఇక వారిని పరామర్శించడానికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెళుతుంటే, మంత్రి స్థానిక సీఐపై ఒత్తిడి తీసుకువచ్చి సెక్షన్ 30 కింద నోటీసులు ఇప్పించారు అంటూ అసహనం వ్యక్తం చేశారు.

కోస్తా, కృష్ణా జిల్లాలలో కోడిపందాలు, పేకాట శిబిరాలు కనిపించటం లేదా?
అధికార పార్టీ బాధితుల వద్దకు చంద్రబాబు వెళ్లకుండా ప్రయత్నాలు చేసిందని, అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని, ప్రతిపక్ష నేతలను అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని అచ్చెన్నాయుడు అసహనం వ్యక్తం చేశారు. కోస్తా జిల్లాలలో నిబంధనలకు విరుద్ధంగా పేకాట శిబిరాలు కోడిపందాలు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయని, కానీ పోలీసులకు అవేవీ పట్టడం లేదని అసహనం వ్యక్తం చేశారు.

సెక్షన్ 30 వాటికి వర్తించదా? మంత్రి పెద్దిరెడ్డికి ఎందుకింత భయం
కోడి పందాలను, పేకాట శిబిరాలను కట్టడి చేయడానికి సెక్షన్ 30 వర్తించదా అంటూ ప్రశ్నించారు. మంత్రి పెద్దిరెడ్డి తప్పు చేయకపోతే ఎందుకింత భయమని ప్రశ్నించిన అచ్చెన్నాయుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడు అక్కడికి వస్తే తన బండారం బయటపడుతుందని భయపడుతున్నాడని విమర్శించారు. ల్యాండ్, సాండ్ మైనింగ్, మద్యం, ఎర్రచందనం కుంభకోణాలు బయటపడతాయని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భయపడుతున్నట్టు ఉన్నారని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. మంత్రి పెద్దిరెడ్డి విపరీత పోకడలను డిజిపి నివారించాలని అచ్చెన్నాయుడు విజ్ఞప్తి చేశారు. వైసీపీ ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని ఖండించారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.












Click it and Unblock the Notifications