‘టార్గెట్ బీజేపీ: అందుకే రాహుల్తో భేటీ, ఢిల్లీ టూర్’: ఏపీ మంత్రులు ఏమన్నారంటే?
అమరావతి: ఏపీ మంత్రులు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు కేంద్ర ప్రభుత్వం, బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో టీడీపీ కూటమిని ఏర్పాటు చేస్తుందని, నాయకత్వం మాత్రం వహించబోదని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.

చంద్రబాబు ప్రధాని పదవి ఆశించడం లేదు
ప్రధాని పదవిని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆశించడం లేదని, రాష్ట్ర ప్రయోజనాలే ఆయనకు ముఖ్యమని అచ్చెన్నాయుడు చెప్పారు. బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో కూటమి ఏర్పాటు చేయడంలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో చర్చలకు సీఎం సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిపారు.

అందుకే రాహుల్తో బాబు భేటీ
రాష్ట్ర ప్రయోజనాల కోసమే తాము ఎన్డీయేలో చేరామని, బీజేపీ నయవంచనకు పాల్పడటంతో బయటకు వచ్చేశామని అచ్చెన్నాయుడు తెలిపారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదా, విభజన హామీలు నెరవేరుస్తామని రాహుల్ ఇప్పటికే ప్రకటించారని చెప్పారు. ఈ కారణంగానే రాహుల్ గాంధీతో చంద్రబాబు సమావేశం కాబోతున్నట్లు తెలిపారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలతో కలిసి పనిచేస్తామని తెలిపారు.

ఎవరితో ఎవరు కలుస్తున్నారన్నది ముఖ్యం కాదు..
ఇది ఇలా ఉండగా, ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ.. దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని.. ఇందులో భాగంగానే ఎవరు ఎవరితో కలుస్తున్నారన్నది ముఖ్యం కాదని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు కాబట్టే ఎన్డీయే నుంచి బయటికి వచ్చామని తెలిపారు.

ఐటీ దాడులతో వేధింపులు..
ఎన్డీయే నుంచి బయటకు వచ్చాక ఐటీ దాడులు ముమ్మరం చేశారని, దేశంలో బీజేపీయేతర పార్టీలను వేధించడం మొదలుపెట్టారని యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. బ్రిటీష్ వారి సమయంలోనూ పార్టీలకు అతీతంగా అంతా ఒక్కటయ్యారని, ఇప్పుడు కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు అంతా ఒక్కటవుతున్నారని యనమల అన్నారు. రాష్ట్రంలో టీడీపీకి ఢోకా లేదన్నారు.

బాబు ఢిల్లీ పర్యటన అందుకే..
దేశాన్ని కాపాడుకోవడం కోసమే బీజేపీయేతర పక్షాల కలయిక అని రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్ అన్నారు. సేవ్ నేషన్ నినాదంతో చంద్రబాబు ఢిల్లీ పర్యటన సాగుతుందని తెలిపారు. బీజేపీ అందరికీ ఉమ్మడి శత్రువుగా మారిందని, అందుకే దేశ వ్యాప్తంగా అందరినీ సమన్వయ పరిచి ఒకేతాటి పైకి తెచ్చేందుకు చంద్రబాబు ఢిల్లీ పర్యటన తెలిపారు.












Click it and Unblock the Notifications