అచ్చెన్నాయుడికి కిషన్ రెడ్డీ సారీ-మోడీ టూర్ లో అవమానంపై-అలా ఎందుకు జరిగిందంటే ?
ఇవాళ భీమవరంలో జరిగిన ప్రధాని మోడీ టూర్ కు టీడీపీ తరఫున ఆహ్వానించిన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు తీవ్ర అవమానం ఎదురైంది. ప్రధాని టూర్ కు రావాలని టీడీపీ అధినేత చంద్రబాబుకు కిషన్ రెడ్డి రాసిన లేఖకు స్పందనగా అక్కడికి వెళ్లిన అచ్చెన్నాయుడిని భీమవరం జిల్లా కలెక్టర్ ప్రశాంతి అడ్డుకున్నారు. దీంతో ఆయన టూర్ కు దూరంగా ఉండిపోయారు.
అనంతరం అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్దకు వెళ్లి నివాళులు అర్పించిన అచ్చెన్నాయుడు.. ప్రధాని పర్యటనలో తనను అవమానించడంపై ఆవేదన వ్యక్తంచేశారు. పిలిచి మరీ అనుమతించకుండా ఆవమానించారంటూ అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రధాని టూర్ కు వచ్చే నేతల జాబితాలో నిన్న రాత్రి వరకూ తన పేరు ఉందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి వల్లే తన పేరు తీసేసారని ఆయన ఆరోపించారు. ఈ ఆరోపణలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు.
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి ప్రధాని మోడీ టూర్ లో ఎదురైన అవమానంపై కిషన్ రెడ్డి స్పందించారు. ప్రధాని టూర్ తర్వాత మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి అచ్చెన్నాయుడుకు ఈ విషయంలో క్షమాపణలు చెప్పారు. సాంకేతిక కారణాల వల్లే ఇలా జరిగిందని చెప్పుకొచ్చారు. ప్రధానమంత్రి కార్యాలయం ఇచ్చిన జాబితాలో పేరు లేకపోవడం వల్లే ఇలా జరిగిందని కిషన్ రెడ్డి తెలిపారు. ఇందుకు బాధ్యతగా క్షమాపణలు చెబుతున్నట్లు ఆయన వ్యాఖ్యానించారు. దీంతో ఈ వివాదం సద్దుమణిగినట్లయింది.