ఆత్మకూరు కోసం వైసీపీలో హైటెన్షన్: భారీగా మొహరింపు?
ఈనెల 23వ తేదీన నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగబోతోంది. ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న భారీ పరిశ్రమలశాఖ మంత్రి గౌతమ్రెడ్డి హఠాన్మరణం పాలవడంతో ఆయన సోదరుడు విక్రమ్రెడ్డిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపింది. మృతిచెందినవారి కుటుంబం నుంచి ఎవరైనా పోటీకి దిగితే దూరంగా ఉండాలనేది తెలుగుదేశం, జనసేన పార్టీల సిద్ధాంతం కావడంతో ఉప ఎన్నికకు ఈ రెండు పార్టీలు దూరంగా ఉన్నాయి. అయితే భారతీయ జనతాపార్టీ మాత్రం బరిలోకి దిగింది.

మంత్రులు, ఎమ్మెల్యేలకు బాధ్యతలు
ఏపీలో బీజేపీ బలం ఏమిటో అందరికీ తెలిసిందే. అయినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అక్కడ టెన్షన్ పడుతోంది. నియోజకవర్గం మొత్తం నాయకులను దింపేసింది. గ్రామానికొకరు, మండలానికొకరు చొప్పున ఇన్ఛార్జిలను నియమించింది. మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా బాధ్యత అప్పజెప్పింది. ఇదంతా బీజేపీని చూసి అనుకుంటే కాదు. ఎట్టి పరిస్థితుల్లోను గెలుపు తమదే కాబట్టి భారీ మెజారిటీ కోసమే ఈ ప్రయత్నమంతా చేస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

భారీ మెజారిటీ కోసమే ఈ ప్రయత్నాలు
ఆత్మకూరులో భారీ మెజారిటీ సాధించి ప్రభుత్వం మీద ప్రజలకు ఎటువంటి వ్యతిరేకత లేదని నిరూపించడానికి వైసీపీ ప్రయత్నిస్తోంది. అంతేకాకుండా గౌతమ్రెడ్డి వివాద రహితుడు కావడం, అతని కుటుంబంపై ఉన్న సానుభూతి కూడా కలిసివచ్చి ఓట్ల వర్షం కురుస్తుందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు.
ఈనెల 10వ తేదీ నుంచి ఇన్ఛార్జిలు రంగంలోకి దిగబోతున్నారు. అప్పచెప్పిన బాధ్యతలను సమర్థవంతంగా నెరవేర్చి తమను తాము నిరూపించుకోవాలని వారంతా పట్టుదలగా ఉన్నారు. తెలుగుదేశం, జనసేనకు వెళ్లే ఓట్లను కూడా వైసీపీవైపు మళ్లించాలని వైసీపీ లక్ష్యంగా పెట్టుకుంది.

భవిష్యత్తు రాజకీయాలకు పునాది ఇక్కడి మెజారిటీ
ఇక్కడ సాధించే భారీ మెజారిటీ భవిష్యత్తు రాజకీయాలకు పునాది లాంటిదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మెజారిటీ తాను అనుకున్నట్లుగా వస్తే జగన్ ముందస్తు ఎన్నికలకు నెమ్మదిగా పావులు కదుపుతారని అంచనా వేస్తున్నారు.
ఒకవేళ తాను అనుకున్నదానికన్నా తక్కువగా వస్తే కాస్తంత సమయం తీసుకుంటారని భావిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఆత్మకూరు ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించి ప్రత్యర్థులకన్నా తాము అందనంత ఎత్తులో ఉన్నామని నిరూపించడమే ప్రస్తుతం వైసీపీ టార్గెట్.












Click it and Unblock the Notifications