బహిర్భూమికి వెళ్లి వచ్చిన నవవధువుపై కిరోసిన్ పోసి నిప్పంటించారు
అమరావతి: విశాఖలోని మన్యం ఏజెన్సీలో ఉన్న అడ్డతీగల మండలం వంగలమడుగు గ్రామంలో దారుణం జరిగింది. గుర్తు తెలియని దుండగుడు ఓ నవవధువుపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు, బంధువులు వెల్లడించిన వివరాల ప్రకారం కత్తిపూడి గ్రామానికి చెందిన ప్రశాంతి(19)కి ఈ నెల 19న ఏలేశ్వరానికి చెందిన వడ్రంగి పనిచేసే అలుకోజి శివతో వివాహమైంది.
ఇదిలా ఉంటే గురువారం మధ్యాహ్నం బహిర్భూమికి వెళ్లి, తిరిగి ఇంటికి వచ్చి కాళ్లు కడుక్కుంటుండగా గుర్తుతెలియని ఓ దుండగుడు ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. దీంతో ఆమె తీవ్రగాయాలు పాలైంది. ఇంట్లో బాధితురాలి తండ్రి అరుపులు కేకలు విని బయటకు పరుగెత్తుకుంటూ వచ్చి చూడటంతో కిందపడి పోయి ఉంది.
దీంతో విషయాన్ని అల్లుడికి తెలియజేసిన తండ్రి అతడి సాయంతో 108లో అడ్డతీగల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కిరోసిన్ దాడిలో ఆమె శరీరం 80 శాతం పూర్తిగా కాలిపోయిందని చికిత్సను అందిస్తున్న వైద్యులు ఆమె పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.
దీంతో అడ్డతీగల జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ కోర్టు న్యాయమూర్తికి సమాచారమిచ్చిన పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. వంగలమడుగులో తన నానమ్మ ఉందని, తనకు అన్నీ నానమ్మే అని అల్లుడు శివ అనడంతో బుధవారం మధ్యాహ్నం అక్కడకు తీసుకువెళ్లామని బాధితురాలి తండ్రి చక్రం పోలీసుల విచారణలో వెల్లడించాడు.
తనపై ఎవరో కిరోసిన్ పోసి అగ్గిపుల్ల వేశారంటూ తన కుమార్తె ప్రశాంతి తన వద్దకు వచ్చి పడిపోయిందని పేర్కొన్నాడు. కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలి నుంచి న్యాయమూర్తి సి.సురేష్ వాగ్మూలం నమోదు చేశారు. కేసు నమోదు చేసుకున్న ఎస్సై టి.రామకృష్ణ అడ్డతీగల సీఐ ముక్తేశ్వరరావు పర్యవేక్షణలో దర్యాప్తు చేస్తున్నారు.
భార్యను కత్తితో అత్యంత కిరాతకంగా నరికి చంపిన భర్త
విజయనగరం జిల్లాలో దారుణం జరిగింది. అగ్ని సాక్షిగా తాళి కట్టిన భర్తే.. భార్యకు కాలయముడయ్యాడు. ఎల్.కోట మండలం రెల్లి గైరమ్మపేట గ్రామానికి చెందిన వెంకటరమణ తన భార్య అప్పలకొండను గురువారం రాత్రి కత్తితో అత్యంత దారుణంగా నరికి చంపాడు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియల్సి ఉంది.