మహిళను నమ్మించి రేప్ చేసిన ఆటో డ్రైవర్: ఆపై బెదిరింపులు
ఓ ఆటో డ్రైవర్ మహిళను నమ్మించి ఆమెపై అత్యాచారం చేశాడు. పైగా తాను చెప్పిన చోటికి రావాలని ఆమెను బెదిరిస్తూ వచ్చాడు. ఆ సంఘటన విజయవాడలో జరిగింది.
విజయవాడ: ఆసహాయతను ఆసరా చేసుకుని నమ్మించి ఓ ఆటో డ్రైవర్ వివాహితపై ఆత్యాచారం చేశాడు. ఈ సంఘటన ఈ నెల 14వ తేదీన జరిగింది. అయితే, అది ఆలస్యంగా వెలుగు చూసింది. వెన్నెముక దెబ్బతినడంతో ఓ మహిళ భర్త ఆసుపత్రిలో చేరాడు. ఆమె కూలి పని చేసుకుంటూనే ఆసుపత్రిలో ఉన్న భర్త వద్దకు వెళ్లి వస్తుండేది.
ఆమె ఆటోడ్రైవర్ ఆస్పత్రి వద్ద దించుతూ వచ్చాడు. ఒక రోజు మోసం చేసి ఆమెపై అత్యాచారం చేశాడు. విజయవాడలోని కొత్తపేట కోమల విలాస్ సెంటర్ ఎదుట కొండ ప్రాంతంలో ఉంటున్న భార్యాభర్తలు అట్టపెట్టెల తయారీ కంపెనీల్లో పనిచేస్తున్నారు.
కొన్నాళ్ల క్రితం కంపెనీ నుంచి ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్న భర్త రోడ్డుపై పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన అతడిని ప్రభుత్వాసుపత్రికి తరలించగా వెన్నెముక దెబ్బ తిన్నట్లు వైద్యులు నిర్ధారించి, శస్త్ర చికిత్స చేశారు. దీంతో ప్రతి రోజూ భార్య పనికి వెళ్లి ముగిసిన తరువాత భర్త వద్దకు వెళ్తోంది.
ఈ నెల 14న ప్రభుత్వాసుపత్రికి వెళ్లడానికి కొత్తపేటలో సిటీ బస్సు ఎక్కి చల్లపల్లి బంగ్లా వద్ద దిగింది. అక్కడి నుంచి ఆసుపత్రికి వెళ్లేందుకు ఆటో కోసం ఎదురు చూస్తుండగా ఒక ఆటో వచ్చి ఆగింది. డ్రైవర్ వివరాలు అడిగి ఆటో ఎక్కించుకుని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. తిరిగి ఇంటికి తీసుకెళ్తానని చెప్పాడు. ఆమెతోపాటే భర్త వద్దకు వెళ్లాడు. క్షేమంగా ఇంటి వద్ద దింపు తానని చెప్పాడు.
అతని మాటలను భార్యాభర్తలు ఇద్దరూ విశ్వసించారు. భర్త వద్ద కాసేపు ఉన్న తర్వాత ఆమె ఆటోలో ఇంటికి బయలు దేరింది. కొంతదూరం మామూలు దారిలోనే నడిపిన డ్రైవర్ తర్వాత ఎనికేపాడు వైపు ఆటోను మళ్లించాడు. దీంతో ఆమె ప్రశ్నించింది. దాంతో బెదిరించి ఓ ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఆమె వద్ద ఫోన్ను బలవంతంగా లాక్కొని తన ఫోన్కు రింగ్ ఇచ్చుకుని నంబర్ను సేవ్ చేసుకున్నాడు.
తర్వాత అక్కడి నుంచి కొత్తపేట సెంటర్కు తీసుకెళ్లి వదిలిపెట్టాడు. ఇంటికి వెళ్లిన బాధితురాలు జరిగిన విషయాన్ని తల్లికి చెప్పింది. మర్నాడు భర్త వద్దకు వెళ్లి విషయం చెప్పి డ్రైవర్ ఫోన్ నంబర్ ఇచ్చింది. ఆ నంబర్కు అతడు ఫోన్ చేసి మాట్లాడగా తన పేరు కృష్ణ అని, ఊరు వైజాగ్ అని చెప్పాడు.
బాధితురాలి నంబర్ తీసుకున్న డ్రైవర్ పదేపదే ఫోన్ చేసి చెప్పినచోటుకు రావాలని బెదిరిస్తున్నాడు. దీంతో బాధితురాలు సీపీఐ నాయకుడు మారుతిని ఆశ్రయించింది. దీంతో సంఘటన వెలుగులోకి వచ్చింది.