ఉచిత బస్సు అమలు వేళ కీలక పరిణామాలు - ప్రభుత్వంపై ఒత్తిడి..!!
ఏపీ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు పథకం అమలుకు సిద్దమైంది. ఈ నెల 15వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానుంది. ఇప్పటికే ప్రయాణానికి వీలుగా బస్సుల ఖరారు.. నిబంధనల పైన ఆర్టీసీ తుది కసరత్తు చేసింది. 6వ తేదీన జరిగే కేబినెట్ భేటీలు మార్గదర్శకాల పైన అధికారికంగా ఆమోద ముద్ర వేయనున్నారు. కాగా, ఉచిత బస్సు అమలుకు సర్వం సిద్దం అవుతున్న వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచే కార్యాచరణ మొదలైంది. మరి.. ప్రభుత్వం ఏం చేయబోతోంది.. ఏం జరగనుంది..
ఈ నెల 15వ తేదీ నుంచి ప్రభుత్వం ఉచిత బస్సు అమలుకు సిద్దం అవుతున్న వేళ అటు ఆటో కార్మికులు.. ఇటు ఆర్టీసీ సిబ్బంది కీలక డిమాండ్లు తెర మీదకు తెచ్చారు. జీవో నెంబర్ 21 విత్ డ్రా చేసుకోవాలని ఆటో కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. తాము ఉచిత బస్సు పథకం అమలుకు వ్యతిరేకం కాదని చెబుతూనే.. తమకు రూ 15 వేలు చొప్పున ఆర్దిక సాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ఆన్ లైన్ ఆటో రైడర్లను నియంత్రించాలని కోరుతున్నారు. ప్రభుత్వం ఆటో డ్రైవర్ల కు రూ 10 వేలు చొప్పున ఆర్దిక సాయం పైన ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. ఉచిత బస్సు పథకం అమలు సమయాన ఆటో డ్రైవర్లకు చెల్లించే విధంగా కసరత్తు జరుగుతోంది. అయితే, ఆటో డ్రైవర్లు నిరసనకు దిగటం.. రూ 15 వేలు డిమాండ్ చేయటంతో ప్రభుత్వం ఏం చేయబోతుంది అనేది ఇప్పుడు కీలకంగా మారుతోంది.
ఇదే సమయంలో ఆర్టీసీ ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు, పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు చెల్లించాల్సిన సెటిల్మెంట్ బకాయిల సమస్యలతో పాటు ఆర్టీసీ ఆస్తులను కాపాడాలని కోరుతూ ఈనెల 12, 13 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనిట్ల వద్ద ధర్నాలు నిర్వహిస్తున్నట్లు ఆర్టీసీ నేషనల్ ఎన్ఎంయూఏ నేతలు ప్రకటించారు.

విజయవాడలో కోట్లాది రూపాయల విలువచేసే ఆర్టీసీ స్థలాన్ని ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టే ప్రయత్నం ప్రభుత్వం మానుకోవాలని, పెండింగ్లో ఉన్న ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దంతో, ఇప్పుడు ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఉచిత బస్సు పథకం అమలు వేళ... ఈ అంశాల పైన 6వ తేదీన జరిగే కేబినెట్ భేటీలో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.ఆటు ఆర్టీసీ యాజమాన్యం పథకం అమలు దిశగా తుది ఏర్పాట్లు చేస్తోంది.












Click it and Unblock the Notifications