అయోధ్యలో చంద్రబాబు: ఇస్రో ఛైర్మన్ పక్కనే కుర్చీ.. ముచ్చట్లు
Ayodhya Ram Mandir: అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవ ముహూర్తం సమీపించింది. కోట్లాదిమంది హిందువుల ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడు జన్మించిన పుణ్యస్థలం అయోధ్యలో.. సరయూ నదీ తీరం ఒడ్డున నిర్మితమైన రామమందిరం ప్రారంభం కాబోతోంది. రామ్ లల్లా విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం మొదలుకానుంది.
ఈ కార్యక్రమం కోసం అయోధ్యాపురి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఇక్కడి ఆలయాలు, ప్రధాన మార్గాలను విద్యుద్దీపాలతో అలంకరించారు. రామ నామ జపంతో ఈ నగరం మారుమోగిపోతోంది. సరయూ నది తీరం మొత్తం రామభక్తులతో నిండిపోయింది. ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తోందక్కడ.

అయోధ్య రామాలయం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా తిలకించడానికి 7,000 మందికి పైగా ప్రముఖులు హాజరు కానున్నారు. వారంతా ఇప్పటికే అయోధ్యకు చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.
రామ్ లల్లా విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట మహోత్సవం ముగిసిన వెంటనే.. హెలికాప్టర్ ద్వారా పూల వర్షాన్ని కురిపించనున్నారు ఆర్మీ జవాన్లు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. దీని కోసం దేశం నలుమూలల నుంచి విభిన్న రకాలకు చెందిన పూలను సేకరించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు అయోధ్యకు చేరుకున్నారు. కొద్దిసేపటి కిందటే ఆయన ఆలయ ప్రాంగణానికి వచ్చారు. శ్రీరామజన్మభూమి తీర్థక్షత్ర ట్రస్ట్ ప్రతినిధులు ఆయనను సాదరంగా ఆహ్వానించారు.

ఆలయ ప్రాంగణంలో అమర్చిన వీఐపీ గ్యాలరీలో తొలి వరుసలో కూర్చున్నారు. అప్పటికే అక్కడికి చేరిన ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమ్నాథ్ పక్కనే ఆసీనులయ్యారు చంద్రబాబు. సోమ్నాథ్తో కొద్దిసేపు ముచ్చటించడం కనిపించింది. అనంతరం కొందరు రాజకీయ ప్రముఖులు చంద్రబాబును పలకరించారు. ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ అంతకంటే ముందే ఆలయ ప్రాంగణానికి చేరుకున్నారు. తనకు కేటాయించిన సీటులో కూర్చున్నారు. అనంతరం మెగాస్టార్ చిరంజీవి, ఆయన భార్య సురేఖ, తనయుడు రామ్ చరణ్ ఆలయ ప్రాంగణానికి చేరుకున్నారు. మెగాస్టార్ కుటుంబం ఈ తెల్లవారు జామున హైదరాబాద్ నుంచి బయలుదేరి రాగా.. పవన్ కల్యాణ్ ఆదివారం సాయంత్రమే అయోధ్యకు వచ్చారు.












Click it and Unblock the Notifications