ఆ ముగ్గురిపై అయ్యన్న సంచలనం, పురంధేశ్వరిపై బాబు 'సీక్రెట్' అనుమానం!
అమరావతి: పోలవరం ఇష్యూ నేపథ్యంలో బీజేపీ నేతలపై ఏపీ మంత్రి అయ్యన్న పాత్రుడు శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలోని కొందరు డూప్లికేట్ల వల్ల పోలవరం ప్రాజెక్టుకు అడ్డంకులు వస్తున్నాయని ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
ఆయన బీజేపీ నేతలు దగ్గుబాటి పురంధేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ, కావూరి సాంబశివ రావులపై గుంటూరులో నిప్పులు చెరిగారు. ఈ ముగ్గురు పోలవరం ప్రాజెక్టుకు అడ్డు పడుతున్నారని ధ్వజమెత్తారు. డూప్లికేట్ బీజేపీ నేతలతోనే సమస్య అంతా వచ్చిందన్నారు.

మొదటి నుంచి బిజెపి నేతలకు అలా కాదు
మొదటి నుంచి బీజేపీతోనే ఉండి అక్కడే ఎదిగిన అసలైన నేతలు ఏపీ అభివృద్ధికి సహకరిస్తున్నారని అయ్యన్న అన్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రాన్ని ఒప్పించి నిధులు తీసుకొస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి తీరతామన్నారు.

చంద్రబాబుదీ అదే మాట
సీఎం చంద్రబాబు నాయుడు కూడా బీజేపీ నేతల వైఖరిపై టీడీఎల్పీ సమావేశంలో అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీని టార్గెట్ చేయవద్దని తమ నేతలకు ఓ వైపు చెబుతూనే, మరోవైపు కొందరు కమలం పార్టీ నేతలపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. కొందరు బీజేపీ నేతల వల్లే పోలవరం సమస్య తలెత్తిందని అభిప్రాయపడ్డారు.

కేంద్రానికి రహస్య లేఖలు
టిడిపి నేతలు కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు. కొందరు నేతలు రహస్యంగా కేంద్రానికి, బీజేపీ అధిష్టానానికి లేఖలు రాస్తున్నారని, ఈ కారణంగానే ఈ సమస్య వచ్చిందని చంద్రబాబు టీడీఎల్పీ భేటీలో పార్టీ నేతలతో వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది.

పురంధేశ్వరి, కావూరి, కన్నాల వైపు వేళ్లు
తద్వారా టీడీపీ నేతల వేళ్లు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి బీజేపీలో చేరిన పురంధేశ్వరి, కావూరి సాంబశివ రావు, కన్నా లక్ష్మీనారాయణల వైపు చూపిస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు కూడా పోలవరం విషయంలో టీడీపీ నేతలపై భగ్గుమంటూ ఈ ముగ్గురు నేతలకు జత కలిశారు.












Click it and Unblock the Notifications