జగన్ ముద్దులు చూసి ఆడవాళ్లు భయపడ్తున్నారు: అయ్యన్న, జెండా పీకేస్తారు
విశాఖ/శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి అయ్యన్నపాత్రుడు ఆదివారం నాడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన దుమ్మెత్తి పోశారు. జగన్ ముద్దులు చూసి ఆడవాళ్లు భయపడుతున్నారని విమర్శించారు. అమ్మాయిలైతే మరీ భయపడుతున్నారన్నారు.
జగన్ భరోసా యాత్ర పైన అయ్యన్న స్పందించారు. పాదయాత్రతో కాదని దమ్ముంటే తమ పాలన పైన చర్చకు రావాలని డిమాండ్ చేశారు. పనికిమాలిన ప్రతిపక్ష నేత ఉన్న సభకు వెళ్లాలంటేనే తనకు సిగ్గేస్తోందని విమర్శించారు.
తండ్రి (వైయస్ రాజశేఖర రెడ్డి), కొడుకు (జగన్)లు రాష్ట్రాన్ని దోచుకున్నారని, అలాంటి వారే ఇప్పుడు అవినీతి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్ని సంవత్సరాలైనా ఎన్టీఆర్ను గుర్తుంచుకోవాలని అయ్యన్న కార్యకర్తలకు సూచించారు. పార్టీలో పదవులు శాశ్వతం కాదని, కార్యకర్తల కోసం ఏం చేసినా తప్పులేదన్నారు.
త్వరలో జెండా పీకేస్తారు: అచ్చెన్నాయుడు
త్వరలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా పీకేస్తారని శ్రీకాకుళం జిల్లాలో మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా ఉండేందుకే జగన్ దొంగ దీక్షలు చేస్తున్నారన్నారు. ప్రజా సంక్షేమమే చంద్రబాబు ధ్యేయమన్నారు.
మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను నిలబెట్టడమే తమ ప్రభుత్వం ధ్యేయమని చెప్పారు. ప్రతిపక్ష నేతగా జగన్ పనికి రారు అన్నారు. ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా ఉండేందుకు దొంగ దీక్షలు చేస్తే ఎవరూ నమ్మరని వ్యాఖ్యానించారు.