నేతలతో పవన్ కళ్యాణ్ బిజీబిజీ, గ్రేటర్ ఎన్నికలపై చర్చ
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నివాసానికి పలువురు తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ నేతలు వరుస కడుతున్నారు. సీమాంధ్రలో టిడిపి, బిజెపి కూటమి విజయం, తెలంగాణలో ఆశించిన ఫలితాలు రావడంలో పవన్ పాత్ర ఉందని భావిస్తున్న ఆ పార్టీల నేతలు ఆయనను కలిసి కృతజ్ఢతలు తెలుపుతున్నారు.
మల్కాజిగిరి లోకసభ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందిన మల్లారెడ్డి పవర్ స్టార్తో భేటీ అయ్యారు. ఆయనతో పాటు బిజెపి, టిడిపి నేతలు, ఎమ్మెల్యేలు పలువురు కలిశారు.

తీగల కృష్ణా రెడ్డి, మాధవరం కృష్ణా రావు, పిఠాపురం ఎమ్మెల్యే వర్మ, విష్ణుకుమార్ రాజు, ఆదికేశవులు తనయుడు శ్రీనివాసులు నాయుడులు భేటీ అయ్యారు. పవన్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా తీగల మాట్లాడారు.
తాను గెలిచేందుకు కారణమైన పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు తెలిపేందుకు వచ్చానని చెప్పారు. రానున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టిడిపి, బిజెపి, జనసేన కూటమిదే ఘన విజయమన్నారు. కూటమి విషయమై తమ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
తెలుగుదేశం పార్టీ కూకట్ పల్లి ఎమ్మెల్యే కృష్ణా రావు కూడా మధ్యాహ్నం పవన్ను కలిశారు. ప్రశాసన్ నగర్లోని కార్యాలయానికి వచ్చి పవన్కు పుష్పగుచ్ఛం ఇచ్చి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కృష్ణా రావు మాట్లాడుతూ.. భవిష్యత్తులోని పవన్ సహకారం ఇరు పార్టీలకు ఉంటుందన్నారు. ఆయన కృషి మరువలేనిదన్నారు.












Click it and Unblock the Notifications