బద్వేలు ఉపఎన్నిక: భారీగా తగ్గిన ఓటింగ్ శాతం, ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
కడప: చెదురుమదరుడు ఘటనలు మినహా బద్వేలు ఉపఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అయితే, గతంలో కంటే.. ఓటింగ్ శాతం ఈసారి భారీగా తగ్గింది. ఓటింగ్ ముగిసే సమయానికి 68.12శాతంగా నమోదైంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు బద్వేలు ప్రజలు ఈసారి పెద్దగా ఆసక్తి చూపనట్లుగా తెలుస్తోంది.
2019 ఎన్నికల్లో 76.37 శాతం పోలింగ్ నమోదు కాగా.. ఈ ఉప ఎన్నికలో పోలింగ్ శాతం 68.12 శాతంగా నమోదైంది. శనివారం ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద జనం బారులు తీరారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.. రాత్రి 7 గంటలకు ముగిసింది. వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
కొన్నిచోట్ల బయటి వ్యక్తులు పోలింగ్ కేంద్రాల వద్దకు రావడంతో పోలీసులు అడ్డుకున్నారు. అట్లూరు పోలింగ్ కేంద్రంలో గుర్తుంపుకార్డులు లేనివారిని వెనక్కి పంపారు. ఎస్ వెంకటాపురంలో బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. బయటి వ్యక్తులు ఓటు వేసేందుకు వచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పలువురిని పట్టుకున్నారు.
గుర్తింపు కార్డులు లేకపోవడంతో పోలీసులు వారిని తిప్పి పంపారు. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. పోలీసులు వారికి సర్దిచెప్పారు. ఎస్ వెంకటాపురం కేంద్రాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుధా, బీజేపీ అభ్యర్థి సురేశ్ సందర్శించారు.
కాగా, బద్వేల్ బైపోల్ పోలింగ్ రాత్రి 7 గంటల వరకు కొనసాగింది. బరిలో మొత్తం 15 మంది అభ్యర్థులు ఉన్నారు. పోటీ మాత్రం వైసీపీ-బీజేపీ మధ్యే జరిగింది. వైసీపీ నుంచి డాక్టర్ దాసరి సుధ, బీజేపీ నుంచి పనతల సురేష్, కాంగ్రెస్ నుంచి కమలమ్మ పోటీ పడ్డారు. 281 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేనలు పోటీ చేయని విషయం తెలిసిందే. నవంబర్ నెల 2న ఉప ఎన్నికల ఫలితం వెలువడనుంది.